భారత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తన జోరును కొనసాగిస్తోంది. అమెరికాపై గెలుపుతో టోర్నీని ప్రారంభించిన భారత్, రెండో మ్యాచ్లో నమీబియాను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా, నమీబియాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.
Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు (5 సిక్సర్లు, 6 ఫోర్లు) చేసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) ధాటిగా ఆడి స్కోరు బోర్డును 200 దాటించాడు. తిలక్ వర్మ (22), సంజూ శామ్సన్ (22) , శివమ్ దూబే (23) తమ వంతు సహకారాన్ని అందించారు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లతో రాణించినప్పటికీ, భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో నమీబియా నడ్డి విరిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించారు. నమీబియా బ్యాటర్లలో లారెన్ స్టీన్క్యాంప్ (29) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో గ్రూప్-A లో అగ్రస్థానానికి చేరువైన భారత్, తన తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
