Site icon NTV Telugu

ICC WTC: పాయింట్ల పట్టికలో మెరుగైన టీమిండియా ర్యాంక్

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్‌ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజ‌యాల‌తో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివ‌ర‌కు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజ‌యాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా టీమిండియా ఖాతాలో 77 పాయింట్లు ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో భారత్ నాలుగు టెస్టులు ఆడగా అందులో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రా ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడగా ఒక విజయం, ఒక డ్రా ఉన్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టులు ఆడగా ఒక విజయం, రెండు పరాజయాలు నమోదయ్యాయి. ప్రస్తుతం సొంతగడ్డపై శ్రీలంకతో రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొన‌సాగుతోంది. ఇప్పటివ‌ర‌కు 2 సిరీస్‌లు మాత్రమే ఆడిన ఆస్ట్రేలియాకు 77 శాతం విజ‌యాలు ఉన్నాయి. ఆరు టెస్టుల్లో నాలుగింట్లో గెలిచిన ఆ జట్టు రెండు మ్యాచ్‌ల‌ను డ్రా చేసుకుంది.

Exit mobile version