ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ మహిళల జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో నెదర్లాండ్స్పై 95 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. దాంతో మెగా టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ పిచ్పై బ్యాటింగ్ అంత సులభం కాదని తెలిపింది. స్మృతి మంధానా, షెఫాలీ వర్మ భాగస్వామ్యమే జట్టుకు బలమైన పునాది వేసిందని తెలిపింది. విజయం క్రెడిట్ ఇద్దరికీ ఇవ్వాల్సిందేనని హర్మన్ప్రీత్ పేర్కొంది.
క్రెడిట్ ఆ ఇద్దరికీ ఇవ్వాల్సిందే:
‘ఈ పిచ్పై బ్యాటింగ్ అంత సులభం కాదు. అయినప్పటికీ స్మృతి మంధానా, షెఫాలీ వర్మ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వారి భాగస్వామ్యమే జట్టుకు భారీ స్కోరు అందించింది. ఆ ఇద్దరికీ పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. జట్టులోని యువ ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. బౌలింగ్ చేసే అవకాశమొస్తే ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆటగాళ్లే జట్టుకు బలం. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకునే ప్లేయర్ భవిష్యత్తులో గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతారు’ అని హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
శ్రేయాంక గాయం గురించి స్పష్టత లేదు:
‘గాయపడిన శ్రేయాంక పాటిల్ పరిస్థితిపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. వైద్య బృందం గాయంను పరిశీలిస్తుంది. పూర్తి వివరాలు తర్వాత తెలుస్తాయి. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో జట్టు అనుకున్న లక్ష్యాలను సాధించింది. జట్టు ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో క్రాంతి గౌడ్ జట్టుకు కీలక సేవలు అందిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా సంపాదించిన అనుభవంను నందిని ప్రపంచకప్లో సద్వినియోగం చేసుకుంటోంది. పవర్ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలను అందించడం సంతోషంగా ఉంది. ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్ప్రీత్ పేర్కొంది.
సెమీఫైనల్ దిశగా మరో అడుగు:
ఈ మ్యాచులో స్మృతి మంధాన (74; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (55; 38 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ జోడీ మొదటి వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం శ్రీ చరణి 4, షెఫాలీ వర్మ 3, నందని శర్మ 2 వికెట్లు పడగొట్టారు. దాంతో నెదర్లాండ్స్పై భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ భారీ విజయంతో భారత్ మహిళల జట్టు గ్రూప్-ఏలో తన స్థానంను మరింత బలోపేతం చేసుకుని సెమీఫైనల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

