BCCI Backs Gautam Gambhir for 2 Major Reasons: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేయడంతో గంభీర్ కోచింగ్పై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఎదురైన టెస్టు సిరీస్ పరాజయాల తర్వాత కూడా గంభీర్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి గంభీర్కు బీసీసీఐ నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది.
మార్పు దశలో భారత్:
తాజా సమాచారం ప్రకారం.. గౌతమ్ గంభీర్ను హెడ్ కోచ్ పదవి నుంచి బీసీసీఐ తొలగించకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో భారత్ ప్రస్తుతం మార్పు దశలో ఉండటం, అలాగే కీలక ఆటగాళ్ల గాయాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపడంను బోర్డు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో భారత టెస్టు జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. దీంతో కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలో యువ ఆటగాళ్లతో కొత్త టెస్ట్ జట్టును నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిస్థితిని బీసీసీఐ కూడా అర్థం చేసుకుంటున్నట్లు సమాచారం. సీనియర్ల స్థానంలో కొత్త ఆటగాళ్లు రావడంతో జట్టుకు స్థిరత్వం రావడానికి కొంత సమయం పడుతుందని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల టెస్టు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. గంభీర్పై వెంటనే చర్యలు తీసుకోకూడదనే అభిప్రాయం బీసీసీఐలో ఉన్నట్లు సమాచారం.
కీలక ఆటగాళ్ల గాయాలు:
టీమిండియా ఇటీవలి సమస్యల్లో గాయాలు కూడా కీలకంగా మారాయి. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు శ్రీలంక టెస్టు సిరీస్కు దూరమయ్యారు. గతంలోనూ పలువురు ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యల కారణంగా కీలక సిరీస్లకు దూరమయ్యారు. ఈ గాయాలు కూడా జట్టు ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో శుభ్మన్ గిల్ గాయపడకపోయి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని బోర్డులో కొంతమంది భావించారట. అన్ని వైఫల్యాలకు గంభీర్ను మాత్రమే బాధ్యుడిగా చేయడం సరైంది కాదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
ఊహాగానాలకు చెక్:
గౌతమ్ గంభీర్ను తొలగిస్తే వీవీఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక టెస్ట్ హెడ్ కోచ్గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం లక్ష్మణ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్ ఆఫ్ క్రికెట్గా తన బాధ్యతల్లో సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శ్రీలంక సిరీస్ తర్వాత భారత్కు మరో రెండు సిరీస్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇలాంటి సమయంలో తాత్కాలిక హెడ్ కోచ్ను నియమించడం పెద్దగా ప్రయోజనం ఇవ్వదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గంభీర్ను కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
గంభీర్కు పూర్తి మద్దతు:
వన్డే, టీ20 క్రికెట్ విషయానికి వస్తే.. గౌతమ్ గంభీర్కు పూర్తి మద్దతు ఉందట. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆయననే టీమిండియా వైట్బాల్ హెడ్ కోచ్గా కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గంభీర్ హెడ్ కోచ్ పదవికి పెద్దగా ముప్పేమీ లేదని చెప్పవచ్చు. టెస్టు జట్టులో జరుగుతున్న మార్పులు, ఆటగాళ్ల గాయాలు, 2027 ప్రపంచ కప్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆయనకు మరింత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాబోయే సిరీస్లలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందనేదే గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనుంది.

