Site icon NTV Telugu

Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

Gautam Gambhir Virat Kohli

Gautam Gambhir Virat Kohli

Gautam Gambhir Fires on Reporter After Ask Virat Kohli Question: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో సంజు శాంసన్‌ (89), అభిషేక్‌ శర్మ (52), ఇషాన్‌ కిషన్‌ (54), జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్‌ పటేల్‌ (3/27)లు కీలక పాత్ర పోషించారు. అయితే టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక రిపోర్టర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించగా.. కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘టీ20 ప్రపంచ కప్ 2026లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టు కుప్పకూలింది. ఛేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు లేకపోవడం మిస్ అయ్యారా?’ అని రిపోర్టర్ అడగ్గా.. ‘అస్సలు మిస్ అవ్వలేదు. ఒక్క శాతం కూడా మిస్ కాలేదు. ప్రస్థుత జట్టుపై, అందరు ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ టీమ్ బాగా ఆడుతోంది. బయట నుంచి ఎవరి అవసరం మాకు లేదు’ అని గంభీర్ సమాధానం ఇచ్చాడు.

‘జట్టు కుప్ప కూలిపోయే పరిస్థితుల్లో మ్యాచ్‌ను నిలబెట్టే ఆటగాడు అవసరమే కదా?’ అని గౌతమ్ గంభీర్‌ను రిపోర్టర్ మరో ప్రశ్న అడిగాడు. అప్పుడు గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘అవును.. మ్యాచ్‌ను నిలబెట్టే ఆటగాళ్లు అవసరమే. ప్రస్తుత జట్టులో కఠిన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన జట్టును నిందించలేం. మిగతా మ్యాచ్‌లలో మా ప్లేయర్స్ బాగా ఆడారు’ అని గౌతీ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించడం సరైంది కాదని గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. ‘ప్రతి విషయాన్ని విరాట్ కోహ్లీతోనే అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేం ప్రపంచకప్ గెలిచాం. ఈ జట్టులోని భారత ఆటగాళ్లు ఛాంపియన్స్. కాబట్టి ఈ విజయాన్ని సాధించిన ఆటగాళ్ల గురించే మాట్లాడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి చర్చ అవసరం లేదు’ అని గంభీర్ స్పష్టం చేశారు. గంభీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. గంభీర్, కోహ్లీ మధ్య పెద్దగా సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే.

Exit mobile version