ఐపీఎల్ 15వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38), సీఫర్ట్ (21) రాణించారు. ముంబై ప్రధాన బౌలర్ బుమ్రా 3.2 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బసిల్ తంపి 3 వికెట్లు పడగొట్టినా ఫలితం దక్కలేదు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177/5 స్కోర్ సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ తొలి వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రోహిత్ (41) అవుటైనా ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 81 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (22) కాసేపు సహకారం అందించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్కు 3 వికెట్లు పడ్డాయి. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.