Most wickets in Women’s T20: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయం అందుకుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో పాకిస్థాన్పై 64 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. తన 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన దీప్తి ప్రపంచ రికార్డు సృష్టించింది.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్:
ఈ ఫైఫర్తో దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించింది. ఆమె వికెట్ల సంఖ్య 166కు చేరుకుంది. దీంతో థాయ్లాండ్ స్పిన్నర్ థిపాచా పుత్తావోంగ్ పేరిట ఉన్న 165 వికెట్ల రికార్డును అధిగమించింది. రువాండా బౌలర్ హెన్రియెట్ ఇషిమ్వే 160 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ 152 వికెట్లు, థాయ్లాండ్ బౌలర్ ఒనిచా కామ్చోంఫు 148 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు. ఈ మ్యాచ్లోనే దీప్తి మరో మైలురాయిని కూడా అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో 350కి పైగా వికెట్లు తీసిన రెండో భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. ఈ ఘనతను అంతకుముందు భారత దిగ్గజ పేసర్ ఝులన్ గోస్వామి మాత్రమే సాధించింది.
ఆందోళన చెందలేదు:
మ్యాచ్ అనంతరం మాట్లాడిన దీప్తి శర్మ.. ఈ ఏడాది ప్రారంభంలో వికెట్లు తీయలేకపోయినా ఆందోళన చెందలేదని చెప్పింది. ‘సరైన సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా జట్టుకు ఉపయోగపడతానని నమ్మకం ఉండేది. ఈ పిచ్లో స్పిన్కు సహకారం లభించింది. అందుకే వేగాన్ని మారుస్తూ సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేశాను. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ మధ్య 91 పరుగుల భాగస్వామ్యం కూడా విజయానికి కీలకం’ అని తెలిపింది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా స్మృతి, దీప్తిలను ప్రశంసించింది. ‘జట్టుకు అవసరమైన ప్రతిసారీ వీరిద్దరూ ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్లో కూడా అదే చేశారు. ప్రతి లీగ్ మ్యాచ్ కీలకం. పాకిస్థాన్పై ఇలాంటి భారీ విజయం సాధించడం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అని పేర్కొంది.
టీ20 ప్రపంచకప్లో భారత్ బోణి:
దీప్తి శర్మ చారిత్రాత్మక ప్రదర్శన, స్మృతి మంధాన అర్ధశతకంతో భారత్ మహిళల టీ20 ప్రపంచకప్లో బోణి కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమిష్టి ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. టైటిల్ పోరులో తాము బలమైన పోటీదారులమని మరోసారి నిరూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో కొంత పోరాటం చేసినా.. భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. ఒక దశలో 75/3తో నిలిచిన పాక్.. అక్కడి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.
మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు:
దీప్తి శర్మ (భారత్) – 166 వికెట్లు*
థిపాచా పుత్తావోంగ్ (థాయ్లాండ్) – 165 వికెట్లు
హెన్రియెట్ ఇషిమ్వే (రువాండా) – 160 వికెట్లు
మేగన్ షట్ (ఆస్ట్రేలియా) – 152 వికెట్లు
ఒనిచా కామ్చోంఫు (థాయ్లాండ్) – 148 వికెట్లు

