Team India Will Receive Asia Cup Trophies: ఆసియా కప్ ట్రోఫీల వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు. 2025 పురుషుల ఆసియా కప్తో పాటు 2026 మహిళల ఆసియా కప్ ట్రోఫీ కూడా త్వరలో భారత్కు చేరతాయని తెలిపారు. ఈ రెండు టోర్నీల్లోనూ భారత జట్లు ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీలను అందుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో రెండు టోర్నీలు దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉన్నాయి.
2026 మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ అనంతరం ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకోకూడదని బీసీసీఐ నిర్ణయించింది. 2025 పురుషుల ఆసియా కప్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆ సమయంలోనూ భారత జట్టు ట్రోఫీని నఖ్వీ నుంచి అందుకోలేదు. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ట్రోఫీని స్వీకరించే విధానానికి సంబంధించి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సంస్థాగత నిర్ణయమని స్పష్టం చేశారు. ‘దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రతిపాదించిన విధానంలో జట్టు ట్రోఫీని స్వీకరించడం సముచితం కాదని బీసీసీఐ భావించింది’ అని సైకియా పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ఆటగాళ్లకు, టోర్నీకి లేదా క్రికెట్కు వ్యతిరేకంగా తీసుకున్నది కాదని దేవజిత్ సైకియా వివరించారు. ఇది బీసీసీఐ అనుసరిస్తున్న వైఖరికి అనుగుణంగా తీసుకున్న సంస్థాగత నిర్ణయమని తెలిపారు. తాజాగా ట్రోఫీలపై మరోసారి స్పందించిన సైకియా.. రెండు ఆసియా కప్ ట్రోఫీలు త్వరలోనే బీసీసీఐ వద్దకు చేరతాయని చెప్పారు. అయితే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. ‘ఎవరైనా సమస్యను పరిష్కరించకూడదని పట్టుబడితే అది వారి నిర్ణయం. మేము సూచనలు మాత్రమే చేయగలం. అమలు చేయడం లేదా బలవంతంగా చేయించడం మా పాత్ర కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాను. రెండు ట్రోఫీలను బీసీసీఐ త్వరలో తిరిగి పొందుతుంది’ అని సైకియా తెలిపారు.
2025 పురుషుల ఆసియా కప్ ట్రోఫీ కూడా ఏడాదికి పైగా భారత్ వద్ద లేదని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. 2026 మహిళల ఆసియా కప్ ట్రోఫీతో పాటు ఆ ట్రోఫీ కూడా త్వరలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుతుందని చెప్పారు. ‘నేను కచ్చితమైన తేదీని చెప్పలేను. కానీ రెండు ట్రోఫీలు త్వరలోనే మన వద్ద ఉంటాయని చెబుతున్నాను. నిన్నటి ట్రోఫీ మాత్రమే కాదు.. ఏడాదికి పైగా మన వద్ద లేని మరో ట్రోఫీ కూడా బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోని కప్ బోర్డులకు చేరుతుంది. ఒక విషయం మాత్రం స్పష్టం.. మనమే ఛాంపియన్లు’ అని సైకియా అన్నారు.

