Axar Patel Breaks MS Dhoni Record After 17 Years: వెస్టిండీస్తో జరిగిన రెండు వన్డే మ్యాచ్లో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బంతితో పాటు బ్యాట్తోనూ చెలరేగిపోయాడు. బౌలింగ్లో ఒక వికెట్ తీసిన అక్షర్.. ఆ తర్వాత బ్యాటింగ్లో కేవలం 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్ల సహాయంతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇతను ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో లక్ష్య చేధనలో భాగంగా.. జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్కి వచ్చి, అత్యధిక సిక్సర్లు (5) బాది, జట్టుని గెలిపించిన ఆటగాడిగా అక్షర్ చరిత్రపుటలకెక్కాడు.
2005లో ధోనీ మూడు సిక్స్లు బాది.. తొలిసారిగా ఆ అరుదైన రికార్డ్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత 2011లో భారత మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ కూడా మూడు సిక్స్లు బాధి.. ధోనీ రికార్డ్ను సమం చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరి కంటే మరో రెండు సిక్స్లు ఎక్కువగా బాది.. వారి రికార్డుల్ని బద్దలు కొట్టాడు. అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా.. భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేయగలిగింది. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు కొట్టాల్సి ఉన్నప్పుడు.. భారత్ ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి.. కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత జట్టుని గెలిపించాడు. దీంతో, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో ఈ సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది.