India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్- పాక్ మూడోసారి తలపడనున్నాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్లో ఢీకునేందుకు ఇరు జట్లు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియాతో మ్యాచ్ అంటే తమపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇండియా- పాక్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో హైటెన్షన్ ఉంటుంది.. క్రికెటర్లపైనా బాగా ఒత్తిడి ఉండటం కామన్.. భారత్తో ఆడిన గత రెండు మ్యాచుల్లో మేం చాలా పొరపాట్లు చేయడంతోనే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తక్కువ తప్పులు చేసిన టీం గెలుస్తుంది.. తప్పకుండా ఈ ఫైనల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని సల్మాన్ అఘా వెల్లడించారు.
ఏసీసీ ప్రొటోకాల్స్ను ఫాలో అవుతాం..
ఇక, టీమిండియా ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి.. మేం మాత్రం ఏసీసీ ప్రోటోకాల్స్ను ఫాలో అవుతామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని వస్తే మేం ముందడుగు వేస్తాం.. లేకపోతే లేదన్నారు. మా చేతుల్లో ఉండే వాటిపైనే మేము ప్రధానంగా దృష్టి పెడతాం.. మీడియాలో వచ్చేవి, బయట అనుకునే వాటిని లైట్ తీస్కుంటాం.. మా లక్ష్యం ఆసియా కప్ గెలవడం మాత్రమే అన్నారు. అయితే, అండర్ -16 రోజుల నుంచి నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను.. గత 20 ఏళ్లలో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా ఉండటం నేనెప్పుడూ చూడలేదని పాకిస్థాన్ సారథి సల్మాన్ పేర్కొన్నారు.
Read Also: Tamilnadu: తొక్కిసలాటకు స్టాలిన్ ప్రభుత్వమే కారణం- టీవీకే పార్టీ నేతలు
షేక్హ్యాండ్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు..
అయితే, భారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న రోజుల్లోనూ ఇలాంటివి జరగలేదని పాకిస్థాన్ కెప్టెన్ అఘా అన్నారు. ఇప్పుడు మాత్రం షేక్హ్యాండ్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇలాంటి పద్దతి క్రికెట్కు మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నాడు. అయితే, సల్మాన్ అఘా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘కరచాలనం’పై స్పందించిన పాక్ సారథి.. తమ జట్టు ఆటగాళ్లు చేసిన చేష్టలపై ఎందుకు మాట్లాడలేదని భారత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
