మహిళల ఆసియా కప్ 2026 ట్రోఫీ వివాదంపై బీసీసీఐ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదన్నది భారత మహిళల జట్టు వ్యక్తిగత నిర్ణయం కాదని.. బీసీసీఐ సమష్టిగా తీసుకున్న నిర్ణయమని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. శ్రీలంకతో ఆదివారం (సెప్టెంబర్ 13) దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి.. మహిళల ఆసియా కప్ను ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. అయితే అనంతరం జరిగిన ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో భారత జట్టు పాల్గొనలేదు. 2025 ఆసియా కప్లో భారత పురుషుల జట్టు ప్రారంభించిన విధానాన్నే మహిళల జట్టు కూడా కొనసాగించింది.
భారత జట్టు ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ నుంచి అందుకోకూడదని బీసీసీఐలో చర్చించి సమష్టి నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ విషయంపై నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. ‘మేము ఈ విషయంపై చర్చించి ట్రోఫీని నఖ్వీ నుంచి స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాం. ఇది మా సమష్టి నిర్ణయం. నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు” అని శుక్లా వెల్లడించారు. నఖ్వీ ట్రోఫీని ఎవరికి అందించాలో వారికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని శుక్లా పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఇదే విషయాన్ని గతంలో స్పష్టం చేశారు. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ట్రోఫీ ప్రెజెంటేషన్లో భారత జట్టు పాల్గొనదని ముందుగానే ఏసీసీకి తెలియజేశామని తెలిపారు.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మొహ్సిన్ నఖ్వీతో దేవజిత్ సైకియా మాట్లాడుతున్న ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై స్పందించిన రాజీవ్ శుక్లా.. అది సాధారణ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమేనని స్పష్టం చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు మాట్లాడటం సహజమేనని, దానిపై అనవసరంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళల ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టును శుక్లా అభినందించారు. భారత మహిళలు మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. ఇక తదుపరి లక్ష్యం జపాన్లో జరిగే ఆసియా క్రీడలేనని, అక్కడ కూడా భారత జట్టు అద్భుతంగా రాణించి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని రాజీవ్ శుక్లా తెలిపారు.

