Ajinkya Rahane Retirement: భారత బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్లో విదేశీ పర్యటనల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచిన రహానే.. స్వింగ్, పేస్కు అనుకూలమైన పిచ్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రహానేకి పలువురు మాజీ, ప్రస్తుత స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయి. వారందరికీ జింక్స్ ఒకటే సమాధానం చెప్పాడట.
రిటైర్మెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి తొలి ఫోన్ కాల్ వచ్చినట్లు అజింక్య రహానే వెల్లడించాడు. ‘రహానే.. నువ్ ఇంకా ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతావు అనుకున్నా’ అని సచిన్ చెప్పినట్లు తెలిపాడు. ఇకపై క్రికెట్ను సాగదీయకుండా, ఎలాంటి అసంతృప్తి లేకుండా కెరీర్ను ముగించాలనే నిర్ణయం తీసుకున్నానని సచిన్కు రహానే చెప్పాడట. సచిన్తో పాటు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రహానేకి ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు రహానేకి మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. అయితే వీరందరికీ రహానే ఒకటే సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. క్రికెట్కు తాను పూర్తిగా న్యాయం చేశాననే సంతృప్తితో ఉన్నానని, తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసినట్లు వెల్లడించాడు.
రిటైర్మెంట్ వీడియోను రికార్డ్ చేసే సమయంలో తాను తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యానని రహానే చెప్పాడు. కుటుంబ సభ్యులతో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్న సమయంలోనే భావోద్వేగానికి లోనయ్యానని, అయితే వీడియో రికార్డింగ్ సమయంలో అది మరింత ఎక్కువైందని తెలిపాడు. ఎన్నో సంవత్సరాలుగా తాను ఎంతో ఇష్టంగా చేసిన క్రికెట్ను ఇకపై ఆడబోననే విషయం తనను కదిలించిందని రహానే పేర్కొన్నారు. పుజారా, కోహ్లీతో తన అనుబంధం గురించి కూడా జింక్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పుజారాతో కలిసి దేశవాళీ క్రికెట్లో చాలా కాలం ఆడానని, విరాట్తో మాత్రం భారత జట్టు తరఫున ఎక్కువ సమయం గడిపానని చెప్పాడు. తమ మధ్య మంచి స్నేహబంధం ఉండేదని, భారత టెస్టు జట్టును అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముగ్గురూ కలిసి పనిచేశామని చెప్పుకొచ్చాడు.
2015లో భారత్ టెస్టు ర్యాంకింగ్స్లో 6-7 స్థానంలో ఉన్న సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, ఆ తర్వాత క్రమంగా ప్రపంచ నంబర్వన్ టెస్టు జట్టుగా ఎదిగామని రహానే గుర్తుచేసుకున్నారు. ఆటపై చర్చించడం, విశ్లేషించడం, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం తమ బంధాన్ని మరింత బలపరిచిందని చెప్పారు. చివరకు భారత జట్టు టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి చేరుకునే ప్రయాణంలో భాగస్వాములుగా ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రహానే పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తనను పలకరించిన సచిన్, కోహ్లీ, రోహిత్, బుమ్రా తదితరులకు రహానే ఇచ్చిన సమాధానం ఆయన కెరీర్పై ఉన్న సంతృప్తిని స్పష్టం చేస్తోంది.

