IND vs ZIM: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. తొలి ఓవర్లోనే జింబాబ్వే వికెట్ల పతనం మొదలైంది. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ సిరీస్ 1-1తో సమమైంది.18.4 ఓవర్లలో 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయింది. జింబాబ్వే తరఫున వెస్లీ మాధేవెరే టాప్ ఇన్నింగ్స్లో 43 పరుగులు చేశాడు, అయితే అతను 39 బంతులు ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్లో ల్యూక్ జోంగ్వే 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. రవి భిష్ణోయ్ రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు.
Read Also: IND vs ZIM: అభిషేక్, రుతురాజ్ ఊచకోత.. జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యం
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. అభిషేక్ శర్మ(100), రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48) విజృంభించడంతో 234 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 22 బంతుల్లోనే 48 పరుగులు చేయడం గమనార్హం. భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మసకద్జ, ముజరబాని తలో వికెట్ సాధించారు. టీమిండియా ఈ విజయంతో 5 టీ-20ల సిరీస్ను 1-1తో సమం చేసింది.