కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. మూడోసారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదల ప్రదర్శిస్తోంది. తదుపరి (2024) సాధారణ ఎన్నికల దిశగా అప్పుడే కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 144 లోక్సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా సెగ్మెంట్లలో పార్టీని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ అనే పేరుతో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లోనూ అమలుచేస్తారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా 3, 4 లోక్సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటుచేస్తారు. ఈ క్లస్టర్లకు ఇన్ఛార్జ్లుగా కేంద్ర మంత్రులను నియమిస్తారు. మొత్తం 40 మంది కేంద్ర మంత్రులకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. ఆయా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు(ఎంపీలు) ఎంపిక చేసిన లోక్సభ నియోజకవర్గాల్లో క్రమంతప్పకుండా పర్యటించాలి. పర్యటనలో మూడు రోజులపాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బస చేయాలి.
read also: Rains: ముంబయిని వణికిస్తున్న వరుణుడు.. మరోసారి భారీ వర్షసూచన
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించటంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతారు. పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కూడా ఒక ఇంఛార్జ్ ఇందులో పాల్గొంటారు. రేపు (బుధవారం) జరిగే పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో ఈ ‘ప్రవాస్ యోజన’పై చర్చించనున్నారు.
హైదరాబాద్లో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ ఫుల్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ స్ఫూర్తితో, రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజల, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రధాని మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగంలో ఉద్భోదించిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన సూచనలను, సలహాలను వెంటనే అమలుచేసేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజానుకూల విధానాలను రూపొందించాలన్నా, సుపరిపాలన అందించాలన్నా ఈ స్థాయి కసరత్తు అవసరమని అర్థంచేసుకుంది. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు లేకపోయినా ఆ టెంపోని పార్టీ కేడర్లో మెయిన్టెయిన్ చేయటానికి బీజేపీ హైకమాండ్ అన్ని చర్యలూ చేపడుతోంది. అందులో భాగమే ఈ ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు