టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, ‘KA’ పేరుతో ‘KA’ ప్రొడక్షన్స్ ప్రారంభించారు. ఆ ప్రొడక్షన్లో ఎంతోమంది నూతన నటీనటులను, నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమా రూపొందించారు. సాయి తేజ్ హీరోగా, వేద హీరోయిన్గా రూపొందించిన ఈ సినిమాతో మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. కిరణ్ అబ్బవరం స్టైల్ ప్రమోషన్స్తో ఈ సినిమా మీద కొంతవరకు అంచనాలు ఏర్పడేలా చేశారు. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూలో తెలుసుకుందాం.
తిమ్మరాజుపల్లి టీవీ కథ:
1990లలో అప్పుడే కలర్ టీవీలు వచ్చిన కొత్తలో సాగే కథ ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన తిమ్మరాజుపల్లి అనే ఒక గ్రామంలో ప్రతి శివరాత్రికి టీవీ అద్దెకు తెచ్చి, అప్పటి స్టార్ హీరోల సినిమాలు వేయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే, ఆ ఊరిలో టీవీ కొనుగోలు చేయడం ఒక పెద్ద ప్రెస్టేజ్ గా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఊరి పెద్ద టీవీ కొనకుండానే, ఆ ఊరికి చెందిన రాజప్ప తనకు వచ్చిన కట్నం డబ్బుతో టీవీ కొనుక్కొస్తాడు.
మరోపక్క రాజప్ప చెల్లి శారద (వేద), ఆ ఊరికి చెందిన చిల్లర దొంగతనాలు చేసే సతీష్ (సాయి తేజ్) ప్రేమలో ఉంటారు. అనునిత్యం టీవీ కోసం ఇంటికి వచ్చే వారితో రాజప్ప విసిగిపోతున్న తరుణంలో, అనుకోకుండా ఆ టీవీ దొంగతనానికి గురవుతుంది. అయితే సతీషే దొంగతనం చేశాడని ఊరంతా భావించి పంచాయితీలో పెడతారు. ఇంతకీ అసలు ఆ టీవీ దొంగతనం చేసింది ఎవరు? సతీషే ఆ దొంగతనం చేశాడా? చివరికి టీవీ దొంగ దొరికాడా లేదా? సతీష్, శారదల ప్రేమ ఫలించిందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఫిలిం మేకర్స్ అందరూ ఎందుకో తెలియదు కానీ, పీరియాడిక్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు. ప్రస్తుత కథలు బోర్ కొట్టించాయో, లేక వాళ్లకు అప్పటి కథలు చెప్పాలనే కుతూహలం పెరుగుతుందో తెలియదు కానీ, ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’తో పాటు ఈ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కూడా 90లలోనే సాగుతూ ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరిలో ఉన్న ముగ్గురు నలుగురి చుట్టూ కథ తిరగటం లాంటి కాన్సెప్ట్లతో చాలా సినిమాలు వచ్చాయి. సింపుల్ గా ఈ సినిమాని కూడా అలాగే రాసుకున్నాడు డైరెక్టర్.
ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయంతో పాటు నెమ్మదిగా కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఊరందరూ ఎంతో గౌరవంగా భావించే టీవీ దొంగతనం అవుతుందో, అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే కథ మొదలయ్యాక కూడా ఎందుకు చుట్టూ చుట్టూ అక్కడక్కడే కథ తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దొంగ ఎవరు అనే విషయం మీదనే సాగుతున్న ఈ సినిమాలో, అందరూ టీవీ దొంగల్లానే కనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్.
అయితే కొంతవరకు ప్రెడిక్ట్ చేసేలాగే ఉన్నా, అక్కడక్కడ కొన్ని ట్విస్టులు రాసుకుని వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. వాస్తవానికి ఈ సినిమాలో నటీనటులు దాదాపుగా అందరూ కొత్తవారే. అక్కడక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించిన వారు ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలలో మెరిశారు. అయితే చిన్న పాయింట్ కావడంతో ఎక్కువ కథను లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు సినిమా మొత్తం చిత్తూరు యాసలోనే మాట్లాడిస్తూ ఉండడం వల్ల చిత్తూరు జిల్లా వారికి బాగా కనెక్ట్ అవ్వచ్చు. కానీ, కొన్నిచోట్ల ఆయా పాత్రలు ఏం మాట్లాడుతున్నాయి అనే విషయం కొంతమందికి అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉంది. ‘పుష్ప’ లాంటి సినిమాల్లో కొన్ని క్యారెక్టర్ల చేత యాస పూర్తిగా పలికించినా, పూర్తి స్థాయిలో అది అర్థమయ్యేలా చూసుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఎందుకో అలాంటి కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోగా నటించిన సాయి తేజ్ నటనకు కొత్తయినా, కొంతవరకు తనదైన స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకున్నాడు. వేద హీరోయిన్గా అతని పక్కన బాగుంది. ఆమె వదిన పాత్ర చేసిన నటికి కూడా మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అలాగే రాజప్ప పాత్రధారి చాలా సీన్స్లో మంచి నటన కనబరిచాడు. దాదాపుగా అందరూ కొత్త ముఖాలే అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ తమదైన శైలిలో నటన కనబరిచారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు కొత్తవాడైనా ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ పాత్రల అమాయకత్వంతో మాట్లాడే మాటలు కూడా కొన్నిసార్లు నవ్వించేలా ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగా సెట్ అయింది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం కేర్ తీసుకున్నారు. నిడివి విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్గా: ఈ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రూరల్ డ్రామాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చు.