టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో–ప్రొడ్యూసర్గా ఎంజీఆర్ రచన–దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లడ్ రోజస్’. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూద్దాం.
కథ : హైదరాబాద్లో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు రాజకీయ నాయకులు తమ కుమారులను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. ఈ హత్యలకు దేవి దాస్ కుమారుడు మదన్కు సంబంధం ఉందని మీడియాలో వార్తలు వస్తాయి. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని భజరంగి దాస్ ప్రయత్నిస్తాడు. ఈ కేసును విచారిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగోయ్ రాజకీయ ఒత్తిడుల కారణంగా సస్పెండ్ అవుతాడు. కేసు సీబీఐకి వెళ్లే దశలో, హోం మినిస్టర్ నిర్ణయంతో స్పెషల్ ఆఫీసర్ అధిర ఈ కేసును హ్యాండిల్ చేస్తుంది. వరుస హత్యల వెనుక ఉన్న అసలు హంతకుడు ఎవరు? రాజకీయ ఆటల మధ్య నిజం ఎలా బయటకు వస్తుంది? అనేదే కథ.
విశ్లేషణ : ‘బ్లడ్ రోజస్’ ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్గా డిఫరెంట్ పాయింట్తో రావాలని ప్రయత్నించిన సినిమా. మహిళలు బలహీనులు కాదని, ప్రతి రంగంలో సమానమనే మెసేజ్ను కథలో భాగంగా చూపించిన విధానం ఒక ప్లస్. అప్సర రాణి పాత్రను సీరియస్ షేడ్స్తో డిజైన్ చేయడం, ఆమె లుక్ను కొత్తగా ప్రెజెంట్ చేయడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాజకీయ నేపథ్యం, వరుస హత్యల కాన్సెప్ట్, ఇన్వెస్టిగేషన్ ట్రాక్ మొదట్లో ఆసక్తిని కలిగిస్తాయి. కొన్ని సీన్లలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే వర్క్ అయ్యాయి.
అయితే కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, స్క్రీన్ప్లే మరింత బలంగా ఉండాల్సింది. చాలా సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా సాగడం వల్ల సస్పెన్స్ తగ్గిపోతుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఇంకా ఎఫెక్టివ్గా డీల్ చేయవచ్చనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని పాత్రలు సరైన డెవలప్మెంట్ లేకుండా వచ్చి వెళ్లిపోతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పేసింగ్ స్లో అవ్వడం, క్లైమాక్స్కు ముందు కావాల్సిన హై పాయింట్ మిస్ అవడం సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయి. బలమైన ట్విస్ట్లు, షార్ప్ ఎడిటింగ్ ఉంటే ‘బ్లడ్ రోజస్’ మరింత ఆకట్టుకునే థ్రిల్లర్ అయ్యేదని అనిపిస్తుంది.
నటీనటుల ప్రదర్శన : అప్సర రాణి అధిర పాత్రలో సీరియస్ షేడ్స్తో కనిపించారు. లుక్ పరంగా కొత్తగా కనిపించినా, ఎమోషనల్ డెప్త్ మరింత ఉంటే పాత్ర ఇంకా బలంగా ఉండేది. ధర్మ కీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో తన వంతు ప్రయత్నం చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగానే సెట్ అయ్యారు.
శ్రీలు పృథ్విరాజ్ జనని పాత్రలో కథకు సహాయపడే కీలక పాత్ర పోషించారు. క్రాంతి కిల్లి ఈసారి పాజిటివ్ రోల్లో కనిపించి ఓకే అనిపించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
చివరగా : డిఫరెంట్ కాన్సెప్ట్తో, మంచి మెసేజ్ చెప్పాలనే ప్రయత్నంతో రూపొందిన సినిమా ‘బ్లడ్ రోజస్’. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఓసారి చూడవచ్చు.