ఔను.. వాళ్లంతా ఒక్కటయ్యారు. సొంతపార్టీ ఎమ్మెల్యేపై వేర్వేరుగా కత్తులు దూస్తున్నవారు రూటు మార్చేశారు. వచ్చే ఎన్నికల్లో తమలో ఒకరు ఎమ్మెల్యే అని కొత్తపల్లవి అందుకున్నారట. వైరివర్గం వేస్తున్న ఈ ఎత్తుగడలు ఎమ్మెల్యే రోజాపై కావడంతో వైసీపీవర్గాల్లో ఒక్కటే చర్చ. రాష్ట్రస్థాయి గుర్తింపు ఉన్నా.. నగరి వైసీపీలో రోజాకు ఇంటిపోరు గట్టిగానే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
నగరిలో వైసీపీ లోకల్ లీడర్లతో రోజాకు రోజూ తలపోట్లే..!
వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. స్థానికంగా సొంతపార్టీలో అసమ్మతి సెగలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు విపక్ష టీడీపీపై పోరాడుతూనే.. ఇంకోవైపు స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారిపైనా మేడమ్ ఫైట్ చేయక తప్పడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో అమ్ములు వర్గంతో.. పరిషత్ ఎన్నికల వేళ నగరి నేతలతో.. మున్సిపల్ ఎన్నికల వేళ KJ కుమార్ వర్గంతో రోజాకు తలపోట్లు తప్పలేదు. నామినేటెడ్ పదవుల పందేరంలోనూ అదే రగడ. చివరకు నగరిలో రోజా వర్సెస్ లోకల్ వైసీపీ లీడర్ల మధ్య గొడవలు డైలీ సీరియల్ మాదిరి చర్చకు దారితీస్తున్నాయి.
ఒక్కటైన రోజా వ్యతిరేకవర్గం.. ప్రత్యేకంగా భేటీ..!
ఇంటి పోరు నుంచి బయటపడేందుకు సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఎమ్మెల్యే రోజా తన బాధలు చెప్పుకున్నా ఫలితం దక్కలేదన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ తనదైన శైలిలో పార్టీలోని ప్రత్యర్థివర్గానికి చుక్కలు చూపిస్తున్నారు ఈ ఫైర్బ్రాండ్. ఇక లాభం లేదనుకుందో ఏమో.. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం కొత్తప్లాన్ అమలు చేస్తోంది. ఇన్నాళ్లూ స్థానిక వైసీపీ నేతలు వైరిపక్షంగా మారి రోజాపై ఎవరికి వారు పోరాటం చేసేవారు. ఆ వ్యతిరేకవర్గమంతా ఇప్పుడు ఒక్కటైంది. నగరిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఏం చేయాలో ప్రణాళిక వేసిందట.
ఎమ్మెల్యే రోజాపై వైరివర్గం గుర్రు..!
ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు. ఆ రోజు చేపట్టే కార్యక్రమాలపై అసమ్మతివర్గం ఎమ్మెల్యే రోజాను కాదని.. వేరేగా సమావేశం పెట్టుకుంది. ఈ మీటింగ్కు పార్టీ నేత KJ కుమార్, ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ KJ శాంతి.. శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీదర్రెడ్డి.. పుత్తూరు నుంచి అమ్ములు, విజయపురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు ఆ మీటింగ్కు వచ్చారట. సీఎం పుట్టినరోజు వేడుకలు తమ ఆధ్వర్యంలో వేరేగా నగరి లేదా పుత్తూరులో నిర్వహించాలని ఆ మీటింగ్లో నిర్ణయించారట.
వ్యతిరేకవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటన..!
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకే వైరివర్గం పరిమితమైతే పార్టీలో పెద్దగా చర్చ జరిగేది కాదు. నియోజకవర్గంలో ఇకపై ఎవరికీ భయపడబోమని.. భవిష్యత్లో తమలో ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి.. తమలోని అసంతృప్తినీ.. ఆగ్రహాన్ని బయటపెట్టారట. టీడీపీ నుంచి వచ్చినవారికి పదవులు అప్పగిస్తూ.. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారట. గతంలో చెప్పినట్టుగానే ఈసారి రోజా ఎమ్మెల్యేగా గెలుస్తారో చూస్తామని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి శపథం చేశారట. రోజా వల్లే నగరిలో టీడీపీ గాలి వీస్తోందని మరో నేత KJ కుమార్ ఫైర్ అయ్యారట.
వ్యతిరేకవర్గం భేటీని లైట్ తీసుకున్న ఎమ్మెల్యే రోజా వర్గం..!
రోజా వ్యతిరేకవర్గమంతా ఇదే ఐక్యతతో సీఎం జగన్ దగ్గరకు వెళ్లితే పరిస్థితి ఏంటన్న చర్చ నగరి వైసీపీలో మొదలైందట. ఎక్కడా లేని విధంగా నగరి వైసీపీలో ఈస్థాయిలో వ్యతిరేక ఎందుకొచ్చిందో పార్టీ పెద్దలు గుర్తించాలని.. లేకపోతే పార్టీకి గుడ్బై చెబుతామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారట. వ్యతిరేకవర్గం మీటింగ్.. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రోజావర్గం మాత్రం లైట్ తీసుకుందట. ఇదంతా జిల్లా పెద్దలు ఆడిస్తున్న డ్రామాగా కొట్టిపారేస్తున్నట్టు సమాచారం. మరి.. మారిన పరిణామాలతో నగరి వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.