NTV Telugu Site icon

TRS : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.?పార్టీ ఇస్తున్న సంకేతాలేంటి.?

New Project (23)

New Project (23)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట.

కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్‌ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు విచారణలో ఉంది. టీఆర్ఎస్‌ అధిష్ఠానం మాత్రం వేములవాడు సిట్టింగ్‌ సీటును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహారావు సేవా కార్యక్రమాల ద్వారా టీఆర్ఎస్‌ కేడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చల్మెడ జానకీదేవి స్మారక ట్రస్ట్‌ పేరుతో కొనకరవుపేట వేములవాడ ప్రాంతాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో చెన్నమనేని రమేష్‌ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే చల్మెడ ట్రస్ట్‌ చేస్తున్న పనులను వాటితో పోల్చి రకరకాల విశ్లేషణలు మొదలుపెట్టేశారు కార్యకర్తలు. మంత్రి కేటీఆర్ సైతం చల్మెడపై ప్రశంసలు కురిపిస్తూ వేములవాడలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో చల్మెడ పోటీకి సిగ్నల్ ఇచ్చినట్టుగా కేడర్‌ భావిస్తోందట. పైగా ఇదే కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేష్‌ కూడా హాజరయ్యారు. ఆ సభలో రమేష్‌ ఉండగానే చెప్పారంటే.. ఏదో ఉండి ఉంటుందని లెక్కలేస్తోందట కేడర్‌.

కొనకరావుపేట మండలంలోని మల్కాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. సభకు వచ్చిన మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనకో కోరిక ఉందని చెప్పడంతో అంతా అలర్ట్‌ అయ్యారట. లక్ష్మీనరసింహారావుకు ఆయన టికెట్ అడుగుతారని అనుకున్నారట. కానీ.. గ్రామానికి మంచిపేరు తేవాలని ఆనందరావు కోరడంతో ఎమ్మెల్యే రమేష్‌ సహా అక్కడున్న కేడర్‌ ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది.

చెన్నమనేని రమేష్‌.. చల్మెడ లక్ష్మీనరసింహారావులు సామాజిక కోణంలో కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇద్దరి మధ్య అంతర్గతంగా టికెట్‌ ఫైట్‌ జరుగుతోందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రమేష్‌బాబు మళ్లీ పోటీ చేస్తారా? పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందా? లేక ఆయనే వదిలేస్తారా అనేది పెద్ద ప్రశ్న. చల్మెడ మాత్రం టికెట్‌ ఆశించే టీఆర్‌ఎస్‌ గూటికి రావడంతో.. ఆయన వర్గం ధీమాగా ఉందట. మరి.. రానున్న రోజుల్లో వేములవాడ సందిగ్ధతకు తెర తొలుగుతుందో లేదో చూడాలి.