OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

OTR: తెలంగాణ సీఎంవోలో ప్రక్షాళన పర్వాన్ని పూర్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నరేళ్ల కాలంలోనే ఇంతటి భారీ మార్పులు జరగడంతో బ్యూరోక్రసీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకుని, కీలక సబ్జెక్టులను పర్యవేక్షించిన ఐదుగురు అధికారులను ఒకేసారి పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎస్ అధికారి షానవజ్ ఖాసిం, ఐఏఎస్ అధికారిణి సంగీత, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డిలతో పాటు శ్రీనివాస రాజులను సీఎంఓ బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం. అయితే వీరందరికీ లూప్ లైన్ కాకుండా, ఇతర విభాగాల్లో గౌరవప్రదమైన పోస్టులే కేటాయించారు. అయినప్పటికీ అసలు సీఎంఓ నుంచి ఎందుకు తప్పించారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొంతకాలంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక ప్రాజెక్టుల ఫైళ్ల క్లియరెన్స్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం కుదరకపోవడం, ముఖ్యమంత్రి ఆశించిన వేగంతో ఫైళ్ళు డెలివరీ చేయలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు పాలనలో దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి.. అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదనే బలమైన సంకేతాన్ని ఈ ప్రక్షాళన ద్వారా పంపినట్టు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పు వెనుక రాజకీయ వ్యూహాలు కూడా గట్టిగానే ఉన్నట్లు భావిస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాబోయే రోజుల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారు. అందుకే సీఎంఓను మరింత చురుకైన, అనుభవజ్ఞులైన అధికారులతో పునర్వ్యవస్థీకరిస్తున్నారు. మొత్తానికి తప్పించిన అధికారులు తప్పు చేశారా? లేక సీఎం అంచనాలను అందుకోలేకపోయారా? అన్నది పక్కన పెడితే.. ఈ ‘సీఎంఓ క్లీన్ అప్’ మాత్రం తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చిన శ్రీనివాస్‌రాజుకు కీలకమైన రెరా బాధ్యతలు అప్పగించడం వెనుక హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దూకుడు పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక అజిత్‌రెడ్డిని పక్కకు తప్పించడం వెనుక సీనియర్‌ ఐఎస్‌ఎస్‌లు కొంతమంది కారణంగా చెబుతున్నారు. తమకన్నా తక్కువ క్యాడర్‌ అధికారి కావడంతో వచ్చిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో అనివార్యంగా అజిత్‌రెడ్డిని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.