OTR: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల రాజకీయం తిరుపతి వేదికగా రచ్చకెక్కింది. ఇన్ఛార్జ్ పదవుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ రణరంగం అవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెర లేపింది. ఆ విషయంలో అభిప్రాయ సేకరణ కోసం తిరుపతిలోని ఓ హోటల్లో సమావేశం పెట్టారు. అసలు తప్పంతా ఇక్కడే జరిగిందన్నది టీడీపీ వర్గాల వాదన. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ నియోజకవర్గాల మీటింగ్ను తిరుపతికి మార్చడంపైనే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట.
తంబళ్లపల్లెకు బీసీ జనార్దన్ రెడ్డి ఇన్చార్జ్ మంత్రిగా ఈ మీటింగ్ ఏర్పాటు పెట్టారు. ఇక పుంగనూరుకు మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశం గొడవల వల్ల రద్దయింది. పుంగనూరు మీటింగ్కు ముందే ప్రస్తుత ఇన్చార్జ్ చల్లా బాబు అనుచరులు, వ్యతిరేక వర్గం మధుసూదన్ నాయుడు అనుచరులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఓ కార్యకర్తకు తీవ్ర గాయమైంది. దానికి తోడు స్థానిక మీడియాపైనా దాడి జరగడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. దీంతో… అసలు ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలోకి పక్క జిల్లాల గొడవలు తెచ్చి పంచాయితీ పెట్టాలనే ఆలోచన ఎవరిదంటూ సొంత పార్టీ సీనియర్లే గుర్రుగా ఉన్నారట. లోకల్ పోలీసులు సైతం ఈ అనవసర రచ్చపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఈ మీటింగ్స్ పెట్టాలని సలహా ఇచ్చింది ఎవరంటూ పార్టీ పెద్దలు విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.
తంబళ్లపల్లె సిగపట్లకు ప్రధాన కారణం మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసేనని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించే జయచంద్రారెడ్డిని ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించింది అధినాయకత్వం. ఇక అప్పటి నుంచి స్థానికంగా పార్టీని నడిపించే సరైన లీడర్ లేక కేడర్ ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కొందరు ఇరికించారని గట్టిగా వాదిస్తున్నారు జయచంద్రారెడ్డి. అందుకు తగ్గట్టే నియోజకవర్గంలో 60 వేల కంటే ఎక్కువ ఓట్ల బలం ఉన్న సామాజికవర్గం తనదేనని, తిరిగి ఆయనకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలంటూ జయచంద్రారెడ్డి మనుషులు బీసీ జనార్థన్ రెడ్డిని నిలదీశారట. ఈ క్రమంలోనే మీటింగ్ హాల్లోకి వెళ్లేందుకు జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాలు పోటీపడి పరస్పరం దాడులకు దిగాయి. మరోవైపు శంకర్ యాదవ్ ఈ ఇన్చార్జ్ పదవి కోసం గట్టిగా పావులు కదుపుతున్నారట. కానీ పదేళ్ళ నుంచి లోకల్గా అడ్రస్ లేని శంకర్ యాదవ్కు ఇన్చార్జ్ పదవి ఇవ్వడాన్ని స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఇస్తే తాము సహకరించే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారట. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ యాదవ్ ఐదేళ్ల పాటు చేసిన అవినీతి, అక్రమాలు అందరికీ తెలుసునని, అలాంటి వ్యక్తి మళ్లీ మాకొద్దంటూ తమ్ముళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు శంకర్ యాదవ్ ఎక్కడా కనిపించలేదని, ఇప్పుడు సీన్లోకి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇలా ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే కొంత కాలంగా పార్టీ పెద్దలు ఈ ఇన్చార్జ్ ప్రకటనను వాయిదా వేస్తూ వచ్చారు.
ఈ గొడవల్ని కాస్త పక్కన పెడితే… అసలు తిరుపతి లాంటి ప్రశాంతమైన చోట… ఉద్రిక్తంగా ఉండే ఈ రెండు నియోజకవర్గాల సమావేశాలు పెట్టాలంటూ సలహా ఇచ్చింది ఎవరనేది ఇప్పుడు అమరావతిలోని పార్టీ పెద్దల మధ్య చర్చనీయాంశమైంది. కనీస ఆలోచన లేకుండా…, ముందు వెనక చూడకుండా మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేశారంటూ తమ్ముళ్ళు కూడా ఫైరవుతున్నారు. అనగాని నేరుగా మీటింగ్లో లేకున్నా…. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయనకు కూడా బాధ్యత ఉంటుందన్నది తమ్ముళ్ళ వాదన. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు అత్యంత సెన్సిటివ్ అని తెలిసినా, గ్రూపుల గోలతో పరస్పర దాడులు కామన్ అని గుర్తించినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ చిన్న నిర్లక్ష్యం కారణంగా… ఈ ఘర్షణలతో పార్టీ పరువు బజారున పడడమే కాకుండా మీడియా మీద కూడా దాడి జరగడం పార్టీకి పెద్ద మైనస్గా అయిందంటూ… ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ మొత్తం రచ్చకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అనగానితో పాటు జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య, మరో ఇద్దరు నేతలే బాధ్యులన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు అనగాని మద్దతు ఇస్తున్నారని, అందుకే ఈ సమావేశాన్ని తిరుపతిలో పెట్టమంటూ సహచరులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డికి సలహా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. గొడవలు జరుగుతాయని తెలిసి కూడా…. పక్క జిల్లా మీటింగ్ను తిరుపతికి మార్చడం వెనుక పెద్ద పొలిటికల్ కాలిక్యులేషన్ ఉందంటున్నారు. కానీ… ఈ ప్లాన్ కాస్తా వికటించి పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ జరిగిందంటున్నారు లోకల్ లీడర్స్. ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం వల్లే సొంత పార్టీ క్యాడర్ బజారున పడి కొట్టుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరగాల్సింది పోయి వాళ్ళలో వాళ్ళు నెత్తురు కారేట్టు కొట్టుకోవడం, మీడియాపై దాడులు జరగడం లాంటి వాటిపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ గొడవలకు కారణమైన లీడర్లు ఎవరు, మీటింగ్ను తిరుపతికి మార్చాలని సలహా ఇచ్చింది ఎవరన్న అంశానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివేదిక కోరినట్టు తెలిసింది. ఈ గొడవలతో తంబళ్లపల్లి, పుంగనూరు ఇన్చార్జ్ల అభిప్రాయ సేకరణను ప్రస్తుతానికి పక్కనపెట్టారట పార్టీ పెద్దలు.

