అడకత్తెరలో పడ్డ సింహాచలం ఆలయ సిబ్బంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్మకర్తగా ఆయనది అధికారం. వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో ప్రభుత్వానిది అజమాయిషీ. ఈ రెండింటి మధ్య ఇప్పుడు సంఘర్షణ జరుగుతోంది. అధికారులు అడకత్తెరలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టు నలిగిపోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఎక్కడిది? ఈ స్టోరీలో చూద్దాం.
గత ఏడాది అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి అశోక్ తొలగింపు
Also Read
సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ్మస్వామి దేవస్థానం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ వ్యవహారాలకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తలు విజయనగరం సంస్ధానాధీశులు. పూసపాటి రాజవంశీకులకు చెందిన ఈ ఆలయంలో వారసత్వం కోసం తొలిసారిగా వివాదం మొదలైంది. ఏడాదిన్నర క్రితం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం. ఆయన స్ధానంలో అశోక్ సోదరుడి కుమార్తె సంచయిత గజపతిరాజును ట్రస్ట్బోర్డ్ చైర్మన్గా ప్రకటించింది. గత ఏడాది మార్చి 4న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సంచయిత దేవస్థానం పాలన, అభివృద్ధి తనదైన ముద్రవేసుకునేందుకు ప్రయత్నించారు.
దివ్యక్షేత్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి!
ఈ సమయంలోనే గోశాల నిర్వహణ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఆవులు మరణించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. రాజకీయంగా అనేక విమర్శలు ఎదురయ్యాయి. అశోక డ్రీమ్ ప్రాజెక్ట్గా ముద్రపడ్డ దివ్యక్షేత్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందనే కారణంగా ప్రాజెక్ట్ను మధ్యలోనే నిలిపివేశారు అధికారులు. అప్పటికే మెట్లమార్గం దాదాపు పూర్తికాగా.. కాంట్రాక్టర్లకు చాలావరకు బిల్లుల చెల్లింపులు జరిగిపోయాయి. అంతర్గత ఎత్తుగడల కారణంగానే దివ్యక్షేత్రం పనులను నిలిపివేశారనే విమర్శలు బలంగానే వినిపించాయి.
కోర్టు ఆదేశాలతో సింహాచలం ఆలయానికి వచ్చిన అశోక్!
సంచయిత గజపతి నియమాకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన అశోక్ గజపతిరాజుకు ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ అనువంశిక ధర్మకర్తగా ఆయన్ని కొనసాగించాలని ఆదేశించింది న్యాయస్థానం. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా పునః నియామకం జరిగిన తర్వాత అశోక్ సింహాచలం దేవస్ధానం దర్శనానికి వచ్చారు. ఆలయం అంతా తిరిగి చూసుకున్నారు. గోశాలలో పరిస్ధితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చైర్మన్గా సంచయిత తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని ప్రకటించారు అశోక్. తాను పదవిలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆలయం ఖాతాలో ఉండేవాని.. వాటి లెక్కలు బయటకు తీస్తామని వెల్లడించారు.
సింహాచలం ఆలయ సిబ్బంది సమాధానంపై ఆశోక్ ఆగ్రహం!
ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కోర్టు ఆదేశాలతో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతి రాజు సింహాచలం వచ్చినప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికేందుకు ఈవో సూర్యకళ, సీనియర్ సిబ్బది ముఖం చాటేశారు. అదేరోజు జరిగిన దేవాదాయశాఖ, పంచగ్రామాల భూముల వ్యవహారం సమీక్ష కోసం ఈవో సహా అధికారులు బిజీగా ఉన్నందున వెళ్లలేకపోయారనే అభిప్రాయం ఉంది. మర్యాదల విషయంలోనే దేవాదాయశాఖ మంత్రి ఆదేశాల మేరకు వ్యవహారించామని ఆలయ సిబ్బంది చెప్పడం అశోక్కు ఆగ్రహం తెప్పించింది. దేవస్ధానం పరిధిలో ఏం జరిగినా తనకు చెప్పాలని.. లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయంలో తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తానని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కూడా.
అడకత్తెరలో పడ్డ ఆలయ ఉద్యోగులు
అమలులోకి కదంబ ప్రసాదం పంపిణీ
కోర్టు ఆదేశాలతో అశోక్ను ఆలయ ఛైర్మన్గా అంగీకరించినప్పటికీ .. పాలనపై తమదైన ముద్ర ఉంటుందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈమేరకు మౌఖికమైన ఆదేశాలు ఆలయ సిబ్బందికి, ట్రస్ట్ బోర్డు సభ్యులకు జారీ అయినట్టు సమాచారం. దీంతో సింహాచలం దేవస్ధానం ఉద్యోగులు అడకత్తెరలో పడ్డారు. మధ్యే మార్గంగా రాజుగారు చెప్పారని కాకుండా ఆలయం, అభివృద్ధి కోసమని కొన్ని చర్యలకు ఉపక్రమించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేపట్టాలనేది అశోక్ ఆదేశంలో ముఖ్యమైనది. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి నిత్యప్రసాదాలు పంపిణీ చేయడం మంచిదనేది ధర్మకర్త ఆలోచన. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే కదంబ ప్రసాదం పంపిణీని అమలులోకి తీసుకుని వచ్చారు దేవస్ధానం అధికారులు. ఇక, గోశాలలో గమనించిన లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద పాము చావకూడదు-కర్ర విరక్కూడదు అనే చందంగా ఎంత కాలం నెట్టుకొస్తామో అర్ధం కావడం లేదని నిట్టూరుస్తున్నారట ఆలయ ఉద్యోగులు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!