ఇన్నాళ్ళు కామ్గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టుండి లేఖాయణం ఎందుకు మొదలుపెట్టారు? నేరుగా సీఎం చంద్రబాబుకే రాయడం వెనక కారణాలేంటి? పైగా టీడీపీ ఎమ్మెల్యే లేవనెత్తుతున్న అంశాలనే ప్రస్తావించడం ద్వారా ఏం ఆశిస్తున్నారాయన. ఎవరా మాజీ శాసనసభ్యుడు? ఏంటి ఆయన పొలిటికల్ గేమ్ ప్లాన్? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు కలం, కాగితం పట్టుకుంటున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక్కో అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబుకు ఆయన రాస్తున్న వరుస బహిరంగ లేఖలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2024లో వైసీపీ బీ ఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయాక వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. 150 రోజులు జైల్లో ఉన్నారాయన. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి హద్దులు మీరి మాట్లాడిన మాటల కారణంగానే… కూటమి ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందని అంటారు. ఇక అధికార మార్పిడి తర్వాత ఆయన పెద్దగా నోరు తెరిచింది లేదు. ఈ పరిస్థితుల్లో… తాజాగా సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వరుసబెట్టి లేఖలు రాయడాన్ని కొత్త పరిణామంగా చెప్పుకుంటున్నారు. వంశీపై గెలిచిన గన్నవరం టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వంశీ సన్నిహితులను టార్గెట్ చేశారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. పలు అంశాలపై వంశీ టార్గెట్గా ఎమ్మెల్యే రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ విడత సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక దగ్గర మట్టి చదును చేసిన కాంట్రాక్ట్ వంశీ సన్నిహితుడికి దక్కిందని, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులు వంశీ సన్నిహితులు, ఎన్నికల్లో ఆయనకు ఆర్థికంగా సహకరించిన కేఎంవీ సంస్థకు కట్టబెట్టారని కూడా ఆరోపించారాయన.
ఆ రకంగా ప్రత్యర్థి పదేపదే చేస్తున్నా…ఎక్కడా స్పందించని వంశీ… ఇప్పుడు వెంకట్రావు ఆరోపణలు సహా నియోజకవర్గ సమస్యలపై నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. గన్నవరం టర్మినల్ పనులు చేపట్టిన కేఎంవీ సంస్థ తన సన్నిహితులదంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లేఖలో రాశారాయన. ఎక్కువ మొత్తానికి పనులు ఇచ్చారని యార్లగడ్డ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి ప్రజాధనాన్ని కాపాడాలని కూడా లేఖలో కోరారాయన. అలాగే… గన్నవరం నియోజకవర్గంలోని రైతులు పట్టిసీమ నీరు వాడుకునేందుకు గతంలో ఏర్పాటు చేసిన మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలంటూ మరో లెటర్ రాశారు వంశీ. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు మోటార్లకు పర్మిషన్ ఇచ్చారని, వైసీపీ హయాంలో కూడా కొనసాగిందని, అలాంటిది ఇప్పుడు మోటార్స్ వద్దంటే రైతులు ఏమైపోవాలని ప్రశ్నించారు. ఇలా… ఆయన రాసిన రెండు లేఖలు ఎమ్మెల్యే యార్లగడ్డకు, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించేనవే కావడంతో… ఎమ్మెల్యే యార్లగడ్డను రాజకీయంగా ఇరుకున పెట్టడానికేనా అన్న డౌట్స్ వస్తున్నాయి కొందరికి. పట్టిసీమ కాలువల మీద మోటర్లకు అనుమతించాలంటూ ఇప్పటికే రైతులు ధర్నాలు చేస్తున్న క్రమంలో వంశీ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్యే ఎన్ని ఆరోపణలు చేస్తున్నా… దానిపై రియాక్ట్ అవకుండా…. నేరుగా సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయడం ద్వారా యార్లగడ్డకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

