OTR : ముఖ్యమంత్రి అమెరికా పర్యటన.. ఆశావహులకు మళ్ళీ నిరాశేనా?

T Congress

T Congress

తెలంగాణ కాంగ్రెస్‌ ఆశావహులకు మళ్ళీ నిరాశేనా? నామినేటెడ్‌ పదవుల భర్తీకి మరో ఆటంకం రాబోతోందా? అయిపోయింది…. అంతా అయిపోయింది…. ఇంకేముంది ఈ నెలలో పదవుల పందేరం అనుకుంటున్న టైంలో… కొత్తగా వచ్చిన అవాంతరం ఏంటి? దేని గురించి ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది? అదిగో ఆషాఢం అన్నారు. ఇదిగో శ్రావణం అన్నారు. అబ్బెబ్బె… అదంతా పెద్ద మేటర్‌ కాదు. జస్ట్‌ పంచాయతీ ఎన్నికలు అయిపోనివ్వండన్నారు. తర్వాత మున్సిపల్‌ ముచ్చట్లు కూడా ముగిసిపోయాయిు. అయినా అడుగు తీసి అడుగు పడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఉందిగా… సెప్టెంబరు మార్చిపైన…. వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ సినిమా సాంగులు సింగడం తప్ప… తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. అదిగో, ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు కాలం వెళ్ళదీస్తూనే ఉన్నారు. మేరా నంబర్‌ కబ్‌ ఆయేగా అంటూ… ఆశావహులు కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళకు మూడ్‌ వచ్చినప్పుడు మనం అందుబాటులో లేకుండాపోతే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఎప్పటికప్పుడు హైదరాబాద్‌ ట్రిప్స్‌ వేస్తూ… పెద్దోళ్ళకు కనిపిస్తూ…. ప్రజెంట్‌ సార్‌ అంటున్నారు. అయినాసరే… వాయిదా పర్వం నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో… ఇటీవల జరిగిన కోర్‌ కమిటీ మీటింగ్‌లో పదవుల భర్తీ ప్రస్తావన వచ్చిందన్న వార్తలతో ఆశలు చిగురించాయి. పార్టీ, ప్రభుత్వ పరంగా నామినేటెడ్‌ పదవులన్నిటి భర్తీ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేస్తారంటూ హ్యాపీ మూడ్‌లోకి వచ్చేశారు అంతా. అందుకు తగ్గట్టే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా… అయిపోయింది… త్వరలోనే పదవుల భర్తీ జరిగిపోతుందని ఇటీవల చెప్పేశారు. జిల్లాల్లో మీటింగ్స్‌ పెట్టుకుని లిస్ట్ పంపండని చెప్పడం లాంటివి ఆశల్ని మరింతగా పెంచాయి.

అయితే… మాటలు కోటలు దాటుతున్నాయిగానీ… కాలు గడప దాటడం లేదన్నట్టుగానే తయారవుతోంది పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో భర్తీ చేసిన 37 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్ట్‌ల కాల పరిమితి కూడా ముగిసిపోయింది. దీంతో… వాళ్లలో రెన్యువల్ ఎవరికి..? ఎంత మంది ఔట్‌ అన్నది కూడా తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు నాయకులు. ఈ విషయంలో సైతం అటు ప్రభుత్వం నుండి కానీ…ఇటు పార్టీ నుండి కానీ క్లారిటీ ఐతే ఇవ్వడం లేదు. ఎప్పటికప్పుడు పదవులు వచ్చేస్తాయి.. గడువు దగ్గరికి వచ్చింది.. అనుకునే సమయంలో ఏదో ఒక అడ్డంకి వస్తోంది. దీంతో… కాంగ్రెస్‌ పెద్దలకు అసలు పదవులు ఇవ్వాలనే ఆలోచన ఉందా..? లేదా అన్న డౌట్‌ కూడా వస్తోంది నేతలకు. అలాంటి డౌట్స్‌ ఏం పెట్టుకోవద్దు, ఈసారి పక్కాగా అయిపోతుంది, జాబితాలు సిద్ధం చేయండని గాందీభవన్‌ నుంచి చెప్పడంతో… ఆ పనిలో ఉండగానే… మరో అవాంతరం కనిపిస్తోందట. తీరా జాబితా వచ్చే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పెట్టుకుంటున్నారు. ఈ నెల మూడో వారంలో ఆయన విదేశీ పర్యటనకు సిద్ధం అవుతున్నారని, వారం నుంచి పది రోజులు విదేశాల్లోనే ఉంటారన్న సంకేతాలందుతున్నాయి. దీంతో… ఆయన తిరిగి వచ్చే వరకు పదవుల భర్తీ లేనట్టేనా..? దాని కోసం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనా అంటూ మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో పదవుల భర్తీ డౌటేనన్నది పార్టీ నేతలు ఎక్కువ మంది అభిప్రాయం. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి అమెరికా వెళ్లబోయే ముందు…ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్స్‌లో కొందరికి రెన్యువల్ చేసే అవకాశం ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కానీ… ఈ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆశావహుల్లో అంతకంతకూ టెన్షన్‌ పెరిగిపోతోంది. ఈ రకంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇష్యూ ఎప్పుడొచ్చినా… ఐతే ఆషాఢం.. లేదంటే ఏదో ఒక ఎన్నికలు, విదేశీ పర్యటనలు. ఇలా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. ఆగస్ట్‌లో అంతా అయిపోతుందనుకున్నారు. ఇప్పుడది సెప్టెంబర్‌కి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. చివరికి అప్పుడన్నా అవుతుందా? లేక ఇప్పుడొక లాంగ్‌ బ్రేక్‌ అంటారా అన్న కంగారు మాత్రం కాంగ్రెస్‌ ఆశావహుల్లో పెరిగిపోతోంది.