తెలంగాణలో కమలం ఎదుగుదలకు సంబంధించిన అత్యంత కీలకమైన సీక్రెట్ రిపోర్ట్ ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలో సమన్వయ లేమి, నాయకుల మధ్య గ్యాప్లాంటి అనేక ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చాపకింద నీరులా హైకమాండ్ తెప్పించుకుందా? అసలు రాష్ట్ర నాయకులు ఎవ్వరూ ఊహించలేని వ్యక్తి ఒకరు సమగ్ర సమాచారాన్ని పైకి పంపారా? దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ అదే నిజమా? డిటైల్డ్ రిపోర్ట్ ఎవరు పంపారని స్టేట్ పార్టీలో చర్చ జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. కొన్ని పైకి కనిపిస్తే…. ఎక్కువ వివాదాలు లోలోపలే పెరిగిపోయి అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తున్నాయి. పార్టీలో పాత-కొత్తల పంచాయితీ ఇప్పటికీ తేలలేదు, ఎప్పటికి తేలుతుందో ఎవరికీ తెలియదు. ఎన్నికల్లో అందరం పార్టీ కోసం పని చేశాం, జెండా మోశాం, ఇక పాతేంది? కొత్తేంది? అన్న వాదన ఒకవైపు నడుస్తుండగానే… మరోవైపు రెండు వర్గాల మధ్య కంటికి కనిపించని అడ్డుగోడ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పుకుంటున్నాయి కాషాయ వర్గాలు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతోంది కేంద్ర నాయకత్వం. ఆ దిశగా ఇక మీదట దృష్టి పెట్టవచ్చంటున్న రాష్ట్ర పార్టీ వర్గాలు… అదే క్రమంలో ఓ సీక్రెట్ రిపోర్ట్ గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. మొత్తం… పిన్ టు పిన్….. అస్సలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందో డిటైల్డ్ రిపోర్ట్ను ఓ పెద్దాయన ఢిల్లీకి పంపారన్నది ఆ చర్చల సారాంశం.
ప్రస్తుతం పార్టీ లీడర్షిప్ మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టినందున అవి అయిపోగానే… తెలంగాణ, కర్ణాటక మీద ఫోకస్ పెడతారని సమాచారం ఉంది. దీంతో ఆ సీక్రెట్ రిపోర్ట్ గురించి కొందరు నాయకులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆశించినట్టుగా లేదన్న అభిప్రాయంతో ఉన్నారు ఢిల్లీ పెద్దలు. దీని గురించి ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోడీ స్వయంగా క్లాస్ తీసుకున్నా… ఇక్కడి నేతలు మారలేదని, వ్యవహారం మొత్తం కుక్క తోక వంకరే అన్నట్టుగా ఉందంటూ పార్టీ అభిమానులు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. చాలామంది నేతలు పార్టీ బాగు కోసం పని చేస్తున్నారా? లేక తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాటపడుతున్నారా అనే చర్చ కూడా ఉంది. అధికారంలోకి రావడం కోసం ఉమ్మడిగా పనిచేయాల్సింది పోయి పెద్దలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి కాషాయ వర్గాల నుంచి. ఈ పరిణామాలన్నిటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్న హస్తిన నాయకులు… తెలంగాణలో అసలేం జరుగుతోందంటూ అప్పుడప్పుడూ ఆరా తీస్తూనే ఉన్నారట. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ గవర్నర్ ఇచ్చారని చెబుతున్న రిపోర్ట్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ అంతకు ముందు తెలంగాణ గవర్నర్గా పని చేశారు. ఆయన మహారాష్ట్రకు వెళ్ళడానికి ముందు తెలంగాణలో అసలు పార్టీ ఎలా ఉంది? నాయకుల తీరు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక పూర్తిస్థాయి రహస్య నివేదికను ఢిల్లీ పంపినట్టు తాజాగా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
తెలంగాణ నుంచి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందే వర్మ ఆ రిపోర్ట్ ఇచ్చారంటూ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదిక సంగతి కొందరు ముఖ్య నేతల దృష్టికి వచ్చిందని, ఒకరిద్దరైతే దాని గురించి డిస్కస్ చేసినట్టు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కమలం లీడర్స్. దీంతో ఆ రిపోర్ట్లో ఏముందంటూ ఆసక్తిగా ఢిల్లీలో తమకు తెలిసిన నాయకుల్ని ఆరా తీస్తున్నారట స్టేట్ లీడర్స్. తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయం లేక పోవడం, క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు, ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు లాంటి చాలా అంశాలు ఆ రిపోర్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారట. అయితే ఆ నివేదికకు సంబంధించిన ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఎలాంటి రిపోర్ట్ పంపలేదని చెబుతున్నాయి రాజ్భవన్ వర్గాలు. అధికారిక ధృవీకరణ సంగతి ఎలా ఉన్నా….జిష్ణుదేవ్వర్మ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు మాత్రం పూర్తి నివేదిక కేంద్ర పార్టీకి చేరిందని బలంగా నమ్ముతున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
