OTR : రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

Roja

Roja

ఫైర్‌ బ్రాండ్‌ వాయిస్‌ ఎందుకు మూగబోయింది? అయినదానికి, కానిదానికి…. నేనున్నానంటూ ఒకప్పుడు మీడియా మైకుల ముందు స్వరం సవరించుకునే ఆ లీడర్‌ ఇప్పుడెందుకు సైలెంట్‌ అయ్యారు? అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో వైసీపీ అటాక్‌ మోడ్‌లోకి వస్తే…. ఆ మాజీ మంత్రి మాత్రం పిలిస్తే వెళతానన్నట్టు ఎందుకు ఉంటున్నారు? ఎవరా ఎక్స్ మినిస్టర్‌? ఏంటా కథ? పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌…. వైసీపీ నోరున్న నేతల్లో ఒకరిగా మాజీ మంత్రి ఆర్కే రోజాకు గుర్తింపు ఉంది. అయితే…. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆమె వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, నోటి ఘాటు పూర్తిగా తగ్గిందన్న అభిప్రాయం బలంగా ఉంది. చివరికి సొంత నియోజకవర్గం నగరిలో కూడా యాక్టివ్‌గా కనిపించడం లేదట. పిలిస్తే శుభకార్యాలకు రావడం, వెంటనే చెన్నై చెక్కేయడం రొటీన్‌గా మారిపోయిందని అంటున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి ఇటీవల వైసీపీ ఆందోళనలు చేస్తోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ సైతం నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నా… ఆ విషయంలో రోజా మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద చర్చ జరుగుతోందట. గత ఎన్నికల్లో 40వేల ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓడిపోయారు రోజా. ఆ తర్వాత తన మకాంను పూర్తిగా చెన్నైకి మార్చేశారామె. మధ్యలో ఇసుక దందా పేరిట హడావిడి చేసినా… అక్రమ రవాణాలో దొరికిన వాహనాలు వైసీపీ నేతలవేనని ఎమ్మెల్యే రివర్స్‌ కౌంటర్ ఇవ్వడంతో రోజా డిఫెన్స్‌లో పడి వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ప్రత్యర్థులపై దాడి విషయంలో మాత్రం పాత రోజా కనిపించడం లేదని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానం పిలిస్తే వెళ్లడం, మాట్లాడమంటే మాట్లాడటం అన్న ధోరణిలో ఉన్నారా? లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి కొందరిలో. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఆమెలో ఉందన్నది ఇంకొందరి వెర్షన్‌. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో అవినీతిపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుండటం మాజీ మంత్రిని మరింత డిఫెన్స్‌లో పడేసిందని అంటారు. ప్రతికూల పరిస్థితుల్లో… రోజా దృష్టి పూర్తిగా కెమెరా వైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.

అందుకు తగ్గట్టే మంత్రి అయ్యాక మానేసిన బుల్లితెర కార్యక్రమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారామె. దాదాపు పన్నెండేళ్ళ విరామం తర్వాత తమిళ సినిమా ద్వారా వెండి తెరపైకి కూడా రీ-ఎంట్రీ ఇచ్చేశారు రోజా. తాజాగా అమె నటించిన ఓ తమిళ సినిమా టీజర్‌లో డైలాగులు బాగా వైరల్‌ అయ్యాయి. అవన్నీ బాగానే ఉన్నా…పార్టీ ఫుల్‌గా రీఛార్జ్‌ మోడ్‌లోకి వచ్చాక కూడా…. రోజా వాయిస్‌ గట్టిగా వినిపించకపోవడానికి కేసులే కారణమా అంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. మునుపటిలా దూకుడుగా వెళ్తే… ఆడుదాం ఆంధ్రా కేసుల్లో చట్టపరమైన చిక్కులు తప్పవని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలతో ఉన్న తీవ్ర విభేదాలు, సొంత నియోజకవర్గంలోనే వర్గపోరు తలనొప్పిగా మారాయని అంటున్నారు. అందుకే.. పార్టీ పిలిస్తే వెళ్లడం, చెబితే మాట్లాడటం తప్ప… కూటమి నేతలను డైరెక్ట్‌గా ఢీకొట్టే సాహసం చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణల్ని కూడా చూపిస్తున్నాయి సొంత పార్టీ వర్గాలు. ప్రశ్న రావణ్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్‌ ఎపిసోడ్‌ లాంటి వాటి విషయంలో పార్టీ గట్టి స్టాండ్ తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని ప్రశ్నిస్తున్నా… రోజా ఎందుకు నోరు తెరవడంలేదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కీలక నాయకురాలు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ సొంత పార్టీ కేడరే గుసగుసలాడుతోందట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తానుగా గొంతు నొక్కేసుకోవడం నాయకత్వ లక్షణం కాదనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. అయితే… రోజా ప్రస్తుతానికి తన వ్యూహాన్ని మార్చుకున్నారా?
సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్న దగ్గరే ప్రస్తుతానికి చర్చ ఆగింది.