ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారిందా? ఒకేసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లి రాజకీయ వేడి పెంచారా? తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నమని సంకేతాలిచ్చారా? తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ సాధ్యమా? ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లారు. చాలాసేపు మాట్లాడారు. వీరి సమావేశం సాధారణంగా కనిపిస్తున్నా…రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ ఎన్నికలు మరో రెండున్నరేళ్లలో జరగబోతున్నాయి. దీంతో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కడతారా అనే చర్చ జరుగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి కలిపి ఏపీలో ఏ రకంగా అయితే కూటమిలో ఉన్నారో….అదే రకమైన కూటమి….తెలంగాణలో కూడా వుంటుందా అంటూ వాడివేడిగా చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్లారంటే సర్జరీ జరిగింది…పరామర్శకు వెళ్లారు అనుకోవచ్చు. కానీ అటు సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోడీ వెళ్లారు. దీంతో సహజంగానే రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో ఓట్లు చీలకుండా పొత్తులో భాగంగా సీట్లు పంచుకున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన 2014లో చివరిసారిగా తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. అయితే, తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడింది. ఆంధ్రా పార్టీ అన్న ముద్ర పడింది. పార్టీలోని కీలక నాయకులంతా చెరో పార్టీకి చెదిరిపోయారు. అయినా లీడర్లు వెళ్లిపోయినా, క్యాడర్ పరంగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలంగా వుంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓటు బ్యాంక్ వుంది. జనసేనకు కూడా తెలంగాణలో కమిటీలున్నాయి.
పార్టీ నిర్మాణం కూడా కొంతవరకు వుంది. ఎలాగూ ఏపీలో కూటమిగా వున్నాయి కాబట్టి…తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. కానీ ఆంధ్రా మూలాలున్న పార్టీలతో జతకడితే…బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదులకు టార్గెట్ అవుతామని తెలంగాణ బీజేపీ నేతలు వెనకా ముందు ఆలోచించారు. అయితే, ఇప్పుడా పరిస్థితులు లేవని కొందరు తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలకుండా, మరిన్ని సీట్లు గెలవొచ్చని బీజేపీ లెక్కలేస్తోంది. ఈ దిశగా చంద్రబాబు, పవన్లతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారా? లేదంటే పర్యటనలో భాగంగా కేవలం పరామర్శలు, పలకరింపులకు పరిమితం అయ్యారా…రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పొత్తు పొడుస్తుందా అనేది త్వరలోనే తేలుతుంది.
