శ్రీకృష్ణదేవరాయలుది ఏ కులం? ఏ సామాజికవర్గంలో పుట్టారాయన? ఏంటీ…. తేడాగా మాట్లాడుతున్నారు, మతిగాని పోయిందా…? అంతటి మహా చక్రవర్తికి కులం ఏంటి? ఎవరో రాజకీయ నాయకుడి గురించి అనుకుంటున్నారా? నో… ఇది సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు గురించే. ఇప్పుడెందుకా టాపిక్ వచ్చింది? కృష్ణదేవరాయలును క్యాస్ట్ దేవరాయలుగా ఎందుకు మారుస్తున్నారు? క్రీస్తుశకం 1509 నుంచి 1529 మధ్య 20 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆ సామ్రాజ్యం అంతరించినా….నాడు చేసిన ప్రజారంజక పరిపాలన, తీసుకున్న నిర్ణయాలతో ఆయన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అంతటి ఘనకీర్తి ఉన్న చక్రవర్తి ఇప్పుడు కుల వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఆయనది మా కులమంటే… మా కులం అంటూ… ఆంధ్రప్రదేశ్లోని రెండు సామాజికవర్గాలు పోటీలు పడటం ప్రస్తుతం పొలిటికల్ హాట్ అయింది. తాజాగా నంద్యాలలో కృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణ సమయంలో రెండు కులాల ప్రతినిధులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. శ్రీనివాస నగర్ సెంటర్లోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేపు విగ్రహ ఆవిష్కరణ అనగా… ఇవాళ కృష్ణదేవరాయలు తమ కులానికి చెందినవాడేనని, అందుకు ఆధారాలు ఉన్నాయంటూ అఖిల భారత యాదవ మహాసభ నేతలు రోడ్డెక్కారు. ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, అలా కాకుండా… మా కులం వాడని క్లెయిమ్ చేసుకుంటూ… బలిజ కులస్తులు ప్రారంభిస్తే అడ్డుకుంటామంటూ రివర్స్ అయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు యాదవ సంఘం నేతలు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడేనంటూ మేమే విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని బలిజ సామాజికవర్గం పట్టుబట్టింది. అయితే… అప్పటికి అధికారులు సర్ది చెప్పి విగ్రహావిష్కరణకు అడ్డంకులు లేకుండా చేశారు. మంత్రి ఫరూక్ విగ్రహావిష్కరణ చేశారు.
అంత వరకు ఓకేగానీ… ఇప్పుడసలు ఆ చక్రవర్తిది ఏ కులం అంటూ కొత్త చర్చ మొదలైంది. ఆయన మావాడేనంటూ ఒకవైపు బలిజ, మరోవైపు యాదవ సామాజికవర్గాలు చెప్పడమేగాక… చారిత్రక ఆధారాలు ఇవిగోనంటూ చూపిస్తున్నారు. ఆయన బలిజ కులస్తుడేనని పోర్చుగీసు చరిత్రకారులు రాశారంటూ…. ‘ది బుక్ ఆఫ్ డ్యూఆర్ట్ బర్బొస'( The Book Of Duarte Barbosa) పుస్తకాన్ని రిఫరెన్స్గా చూపిస్తున్నారు. ఆ వంశంలోని చివరి రాజు పెదకోనేటి రాయుడు కూడా బలిజ కులం అనే రాసుకున్నారని వాదిస్తున్నారు. అలాగే… పట్టాభిషేక సమయంలో వర్ణన అంటూ మరికొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు బలిజ కుల సంఘాల నాయకులు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా రాసినన ఆముక్తమాల్యదలో తాను చంద్రవంశ క్షత్రియుడినని చెప్పుకున్నారని, బలిజలు చంద్రవంశ క్షత్రియులేనని చరిత్ర చెబుతుందంటూ వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన మావాడేననేందుకు మా దగ్గర కూడా ఆధారాలున్నాయంటున్నారు యాదవ సంఘాల ప్రతినిధులు. మైసూర్ ఆర్కియాలజీ విభాగం నుంచి ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం ప్రకారం కృష్ణదేవరాయలుది యాదవ సామాజికవర్గమేనన్నది వాళ్ళ వాదన. చరిత్ర పరిశోధకుడు ఎద్దినపూడి వెంకటరత్నం మైసూర్ ఆర్కియాలజీ విభాగంలోని శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం కూడా ఇదే చెబుతోందని వాదిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి తులువ నరసరాయలు చనిపోతే… అచ్యుతరాయలు గయలో పిండ ప్రదానం చేసి… శాసనాలు రాయించారని, అందులో యదుకుల తిలకుడు అని సంబోధించారని, యదుకులమంటే… యాదవ కులమనే అర్ధం అంటూ తమ వాదన వినిపిస్తున్నారు. ఇది చారిత్రక ఆధారం కాదా అని అడుగుతున్నారు యాదవులు. ప్రొద్దుటూరు దగ్గర రామేశ్వరాలయం ఉందని, వివాహ పన్ను రద్దు చేస్తున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు అక్కడే ప్రకటించారని, ఆ సందర్బంగా ‘గోపకులోద్భవుడు’ అంటూ బిరుదు ఇచ్చారని చెబుతున్నారు. ఆ బిరుదు కూడా ఆయన యాదవ సామాజికవర్గానికి చెందినవారు అనడానికి చారిత్రక ఆధారం అని అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలుది తమ కులమంటే తమ కులం అనే వివాదం 2010 నుంచి తీవ్రమైంది. ఆయన విగ్రహాలను ఎక్కువగా ప్రతిష్టించడం మొదలయ్యాకనే ఈ వివాదం ముదిరిందని అంటున్నారు పరిశీలకులు. రాయలసీమలో ఎక్కడ చూసినా బలిజ సామాజికవర్గీయులే కృష్ణదేవరాయలు విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా క్యాస్ట్ వార్ గట్టిగానే జరుగుతోంది. ఇది రాజకీయ రంగుకుడా పులుముకుంటోంది. కొందరు ఇదే అవకాశంగా హద్దులు మీరు ప్రవర్తిస్తూ నాయకులుగా ఎదిగేందుకు వేదికగా ఎంచుకుంటున్నారట. కులం కూడు పెడుతుందా అన్న మాట వేరే రంగాల్లో ఎలా ఉన్నా… పాలిటిక్స్లో మాత్రం అదే కూడు. అసలు తుళు వంశానికి చెందిన రాజుది ఏ కులం అంటూ…. ఇప్పుడు కొట్టుకోవడం అవసరమా అని వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. కానీ… మీకు అవసరం లేకుంటే పోవచ్చుగానీ… మాకు మాత్రం కావాల్సిందే అదే ఫుల్ పొలిటికల్ మీల్స్ అంటున్నాయి రాజకీయ పక్షులు.

