Site icon NTV Telugu

Off The Record : శృంగవరపు కోటలో అవినీతి అధికారుల లీలలు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయి అక్రమాలు

Kolal

Kolal

నియోజకవర్గంలో రాజకీయంగా భారీ వివాదం రేగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు… స్థానిక ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. భూముల వ్యవహారాలు… లంచాల కేసులు… విదేశీ టూర్లు… ఇలా వరుస ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో రాజకీయంగా హీట్ పెరిగింది. ఇంతకీ ఎవ్వరా ఎమ్మెల్యే.. ఎవ్వరా అధికారి.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం అవినీతి ఆరోపణలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పై తాజాగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండలస్థాయిలో జరుగుతున్న అధికారుల అవినీతి వెనక ఎవరు ఉన్నారని ఆరా తీస్తే….చివరికి కొందరు ప్రజాప్రతినిధుల ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యేకంగా వేపాడ మండలంలో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. ఓ తహశీల్దారుతో కలిసి గుడివాడ ప్రాంతంలో 17 ఎకరాల భూమి వ్యవహారంలో పెద్దలు జోక్యం చేసుకుని భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు రైతుల నుంచే వస్తున్నాయి. మా భూమిని బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నారు…మాకు న్యాయం కావాలి అని రైతులు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఇటీవల సింగరాయి వద్ద జరిగిన ఘటనలో ఒక వీఆర్వో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ వీఆర్వో ఓ ప్రజాప్రతినిధికి బినామీగా పనిచేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఇంతటితో ఆగకుండా, ఒక ఎమ్మార్వో, ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తప్పుడు సమాచారం ఇచ్చి లీవ్ తీసుకుని విదేశాలకు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ అంశంపై కలెక్టర్కు అధికారులు నివేదిక సమర్పించినప్పటికీ, నేతల ఒత్తిడి కారణంగా ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా చర్యలు నిలిచిపోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అవినీతి అధికారులను కఠినంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి స్థాయిలో సూచనలు ఉన్నప్పటికీ స్థానికంగా మాత్రం భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్న సమయంలో స్థానికంగా ప్రజాప్రతినిధులే వారిని కాపాడుతున్నారన్న ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారాల వెనుక అక్రమార్జనలో వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే శృంగవరపుకోటలో అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల వ్యవహారం అన్నీ కలిసిపోయి పెద్ద వివాదంగా మారాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏంటి…ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Exit mobile version