రేషన్ లెక్కల్లో తేడా వచ్చిందా? సరి చేయకపోతే పరిస్థితి వేరేగా ఉంటుందని ఓ చిన్న ఝలక్ ఇచ్చారా? కాకినాడ పోర్ట్లో కొత్తగా బియ్యం పట్టుబడటం అందులో భాగమేనా? రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నా… రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగలేదా? దాదాపు ఏడాదిన్నర తర్వాత అక్రమ బియ్యం దొరకడం వెనకున్న రహస్యం ఏంటి? పోర్ట్ కేంద్రంగా ఏం జరుగుతోంది? కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో గతవారం ఐదు లారీల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. విదేశాలకు తరలిస్తున్న 140 టన్నులు ఉన్నట్లు గుర్తించారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెరిగింది. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు దగ్గర ప్రత్యేక చెక్ పోస్ట్లు పెట్టారు. ప్రతి లారీని తనిఖీ చేసి అక్రమం కాదని నిర్ధారించుకున్నాకే పోర్టులోకి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చారు. అంత గట్టి చర్యలు తీసుకుని, పై స్థాయిలో ఆదేశాలు ఇచ్చాక కూడా మళ్లీ పోర్టులో రేషన్ బియ్యం దొరకడం ఏంటంటూ గట్టిగానే చర్చ జరుగుతోంది. అంటే… రైస్ స్మగ్లర్స్ ఆ ఆర్డర్స్ అన్నీ తూచ్ అంటున్నారా? అధికారం మారినా రేషన్ మాఫియా యధావిధిగా కొనసాగుతోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి చాలామందికి.
అదే సమంలో అదంతా ఓపెన్ సీక్రెట్ అని, దానికి అనుగుణంగానే లెక్కలు సరి చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా యధావిధిగానే జరుగుతోందని, పైన సర్దుబాటు చేసే వ్యక్తులు మారారు తప్ప… కింద వ్యవస్థ అలాగే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కాకినాడలో. ఇప్పుడు పట్టుబడ్డవాటిలో మోతుకూరులోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లు నుంచి 25 టన్నులు, వైజాగ్లోని ఆగ్రోస్ రైస్ మిల్లు నుంచి 25 టన్నులు, గాడాలలోని గోల్డెన్ ఆగ్రోస్ నుంచి 35 టన్నులు, రాజానగరంలోని గురుదత్త రైస్ మిల్లు నుంచి 35 టన్నులు, జగ్గంపేట లోని శ్రీ బాలాజీ బాయిల్డ్ రా రైస్ మిల్లు నుంచి 25 టన్నులు రేషన్ బియ్యం పోర్టుకు వచ్చినట్టు లెక్క తేల్చారు అధికారులు. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పది రోజుల కిందట జగ్గంపేట బాలాజీ రైస్ మిల్లుకి అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించి అంతా పర్ఫెక్ట్ గానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఏకంగా పాతిక టన్నుల రేషన్ బియ్యం అదే రైస్ మిల్లు నుంచి తరలిస్తూ ఎలా దొరికిందంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు చాలామంది.
ఇక మిల్లర్లు, ట్రేడర్ల మధ్య అయితే… రకరకాలుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది దీని గురించి. ఈ చర్చల్లో నుంచే పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ మాఫియాపై గట్టిగా ఫోకస్ చేసిన మాట వాస్తవమే. కానీ… ఆ తర్వాత అక్రమ రేషన్ నెట్వర్క్ నడిపించే వాళ్ళంతా ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చారట. వ్యాపారంలో పర్సంటేజ్ ప్రకారం అధికారులకు మామూళ్ళు ఆఫర్ చేశారన్నది ఇంటర్నల్ టాక్. పౌర సరఫరాల శాఖలోని కొందరు ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు అంతా కామ్గా జరిగిపోవాలిగానీ… ఆ పాతిత టన్నులు ఎలా పట్టుబడిందని అంటే…. రేషన్ మాఫియా నుంచి రావాల్సిన మామూళ్ళు, వాటాల లెక్కలు తేడా వచ్చి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు కొందరు. అలాగే… చుట్టుపక్కల జిల్లాల నుంచి పోర్ట్ కి వచ్చే పేదల బియ్యాన్ని పోర్ట్కు చేర్చే విషయంలో శాఖల వారీగా సమన్వయం కూడా ఉందట. అయితే ఈ మధ్య సరిగా పట్టించుకోకపోవడం, వార్నింగ్ ఇచ్చినా లైట్ తీసుకోవడంతో తొలిసారి బియ్యం లెక్కలు బయటపడ్డాయని అంటున్నారు. లేదంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎందుకు దొరుకుతాయంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరోవైపు పైవాళ్లకు కట్టాల్సిన కప్పం కట్టకపోతే అలాగే ఉంటుందంటూ ఇంకొందరరు ముక్తాయింపు ఇస్తున్నారు.
మా పాటికి మేం వ్యాపారం చేసుకుంటాం, పక్క వాళ్ళని పట్టించుకోమంటే ఇలాగే ఇంటుంది, వాళ్ళకు మాత్రం మండదా అంటూ గడుసుగా ప్రశ్నిస్తున్నారట ఈ వ్యాపారంలోని కొందరు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా నడిపిన వాళ్లే ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ చుట్టూ చేరారట. వాళ్లు కూడా ఈ వ్యవహారం ఇంతవరకు వస్తుందని ఊహించలేదని అంటున్నారు. ఒక్క చిన్న ఝలక్ ఇస్తే అంతా సెట్ అవుతుందని భావించడం వల్లే మేటర్ బయటికి పొక్కి ఉండవచ్చన్నది ఇంకో అంచనా. అలాగే ఊరూరూ తిరిగి రేషన్ బియ్యం వెళ్లి సేకరించే వాళ్ళు , ట్రేడర్లు, మిల్లర్లు అలెర్ట్ అవ్వకపోతే తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయని కూడా అంటున్నారు. మొత్తానికి రేషన్ లెక్కల్లో తేడా అయితే వచ్చిందన్నది విస్తృత అభిప్రాయం. ఏదో… జరిగిపోతోందికదా అనుకుంటూ… రాను రాను వ్యాపారాన్ని ఈజీగా తీసుకోవడంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారనే టాక్ ఉంది. ఈ దెబ్బకు రేషన్ మాఫియా మెంబర్స్ సెట్ అయి మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేసుకుంటారో, లేక అప్పటికి, ఇప్పటికి పరిస్థితిలో తేడా లేదన్న సంగతి బయటపడింది కాబట్టి…. ప్రభుత్వ పెద్దలు కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తారా అన్నది చూడాలి.
