తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇద్దరు కాస్త తేడాగా వ్యవహరించారా? వాళ్ళ నిర్ణయంతో పార్టీ కేడర్ కూడా షాక్ అయిందా? ఆ మార్పు పార్టీకి తెలిసే జరిగిందా? లేక వ్యక్తిగతమా? ఎవరా ఇద్దరు లోక్సభ సభ్యులు? తేడా అనిపించేలా ఏం చేశారు? తెలంగాణలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అందులో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎవరు ఎవరితో కలిశారు, ఏం పంచుకున్నారన్నది చివరి వరకు ఉత్కంఠగా మారి….. సస్పెన్స్ థ్రిల్లర్ని మరిపించింది. ఈ విషయంలో కమలం పార్టీ వైఖరి గురించి ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. కాషాయ దళం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కోలా వ్యవహరించి అసలు వీళ్ళు ఎటున్నారన్న సంగతి అర్ధంకాకుండా చేసింది. అనైతిక పొత్తులు పెట్టుకోబోం, ఎవరితో కలవబోమంటూ…. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కొన్ని చోట్ల ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంది బీజేపీ. సరే… అది మంచి సంప్రదాయం, ఆదర్శవంతమైన రాజకీయం అనుకుంటుండగానే…మరికొన్ని చోట్ల అన్నిటినీ పక్కన పెట్టేసి అధికారం కోసం ప్రత్యర్థులతో జతకట్టి ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒకచోట కాంగ్రెస్తో, మరొక చోట బీఆర్ఎస్తో చేతులు కలిపిన తీరును చూసి వీళ్ళేంటో… వీళ్ళ విధానాలేంటో… అసలేం అర్ధంకావడం లేదన్న రాపు రమేష్ సినిమా డైలాగ్ని గుర్తు చేసుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందరిలాగే… బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ముందే అంచనాలు వేసుకుని పార్టీకి అవసరం అనుకున్న చోట నమోదు చేసుకున్నారు. అయితే… ఇద్దరు ఎంపీలు అండ్ సీనియర్ లీడర్స్ రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అస్సలు ఎవరూ ఊహించని చోట వాళ్ళు ఎక్స్అఫిషియో ఓటర్స్గా నమోదు చేసుకున్నారు.
ఈ విషయం బయటికి తెలిశాక ఆశ్చర్యపోతున్న చాలామంది వాళ్లు అక్కడే ఎందుకు నమోదు చేసుకోవాల్సి వచ్చింది? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియోగా నమోదయ్యారు. ఇక ఈటల రాజేందర్ ఎల్లంపేట మున్సిపాలిటీలో చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఇస్నాపూర్లో బీజేపీ ఒక్క వార్డ్ కూడా గెలుచుకోలేదు. అయినా సరే… ఎంపీ అక్కడెందుకు ఓటు నమోదు చేసుకున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. పైగా…. లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రఘునందన్రావు కలిసి ఒకే కారులో రావడం చూసి అక్కడున్నవారంతా షాకయ్యారట. దీని గురించే పార్టీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకుని మళ్ళీ పాత గూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో మహిపాల్రెడ్డి వర్గం మొత్తం బీఆర్ఎస్కే సపోర్ట్ చేసిందన్నది లోకల్గా చెబుతున్న మాట. పైగా… ఇస్నాపూర్లో ఛైర్మన్ సీటును బీఆర్ఎస్ గెల్చుకుంది. బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలన్నది ఎంపీ సొంత నిర్ణయమా లేక ఇంకేదన్నా స్టోరీ ఉందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారట బీజేపీ నాయకులు. స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రఘునందన్రావు ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నా…. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డితో కలిసి ఒకే కారులో రావడం చూస్తుంటే… అనైతిక పొత్తులు పెట్టుబోకోబోమన్న మాటలకు అర్ధం ఏంటో తెలియడం లేదని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. ఇదే సమయంలో ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి మరోచోట ఆ పార్టీ మద్దతు తీసుకున్నారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.
పార్టీకి తెలిసే ఎంపీ ఆపని చేశారని అంటున్నా… ఎమ్మెల్యేతో కలిసి రావడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయట స్థానిక కాషాయ శ్రేణులు. ఇక ఈటల రాజేందర్ విషయానికి వస్తే…. ఆయన ఎల్లంపేటలో ఎందుకు ఎక్స్అఫిషియోగా నమోదు చేసుకోవాల్సి వచ్చింది…. తెరవెనుక జరిగిన పరిణామాలు ఏంటన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మంచో చెడో చేసుకున్నారు సరే…. మరి ఛైర్మన్ ఎన్నికను ఎందుకు స్కిప్ చేశారన్నది ఇంకో పెద్ద ప్రశ్న. మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో ఆ పార్టీ ఒక చోట బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వగా మరో చోట కాంగ్రెస్కు ఇచ్చింది. రెండు చోట్ల బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. అటు ఎల్లంపేటలో ఎమ్మెల్యే మల్లారెడ్డికి, ఈటలకు మధ్య చర్చలు జరిగాయని, కానీ… అవి సక్సెస్ కాలేదన్న ప్రచారం ఉంది. తాను అనుకున్న విధంగా పరిణామాలు జరక్కపోవడం వల్లనే ఈటల ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రేపు గ్రేటర్ పరిధిలో జరిగే మూడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం ఇద్దరు ఎంపీలకు ఉన్నా… దాన్ని వదిలేసి ఇలా చిన్న పురపాలక సంస్థల్లో ఎందుకు నమోదు చేసుకున్నారన్నది చర్చనీయాంశమైంది.