మిత్ర భేదం ముదురుతోందా? ఇద్దరు మిత్రుల మేటర్ విడాకుల దాకా వెళ్తోందా? కలిసి పోవాల్సిన వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఎందుకు? అన్నిటికీ సై అంటున్నారు కదా అని మెడల మీద ఎక్కి తొక్కుతామంటే ఊరుకుంటామా అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎవరా ఇద్దరు మిత్రులు? ఎందుకు తెగేదాకా లాక్కుంటున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీపీఐ జతకట్టింది. మిత్రులుగా కలిసి పనిచేసి రెండు పార్టీలు లాభపడ్డాయి. మామూలుగా అయితే…. అధికారంలో ఉన్న పార్టీ తన మిత్రుణ్ణి సతాయిస్తూ ఉంటుంది. కానీ.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో ఉంది. సిపిఐ నేతల వ్యవహార శైలిపై.. కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. మిత్రుడే కదా అని… మెలిపెట్టి తిప్పితే ఎలాగని అడుగుతున్నారు.
సీపీఐ మిత్ర ధర్మం పాటించాలని కూడా గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీలో ఎంతో మంది ఆశలు పెట్టుకున్నా వదిలేసి…. వచ్చిన ఎమ్మెల్సీ సీటును సీఎం రేవంత్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కలిసి సీపీఐకి కేటాయించారని, ఆ గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు గాంధీభవన్ లీడర్స్. MLCతో పాటు సీపీఐ పెట్టిన ప్రతీ డిమాండ్ పై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఐతే.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని నుంచి కాంగ్రెస్ దోస్తీకి కటీఫ్ చెప్పే స్థాయిలో ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రిని కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటామన్న స్థాయిలో ప్రకటన చూసిన తర్వాత కాంగ్రెస్లోని ఓ వర్గం భిన్నంగా రియాక్ట్ అవుతోంది. కొత్తగూడెం మేయర్ సీటు దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ దిశగా అడుగు వేశారు కూడా.
సీఎం దగ్గర మీటింగ్ లో సయోధ్య కుదిర్చి.. సిపిఐకి అప్పగించారు. అయితే… క్యాతన్పల్లి, కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోవడం వల్లనే మైత్రికి దెబ్బ పడిందన్నది కామ్రేడ్స్ అభిప్రాయం. మామూలుగా అయితే…కాంగ్రెస్ లోనే సీట్ల కోసం తెగ లొల్లి ఉంటుంది. అన్ని రకాలుగా కష్టపడి… పదవులు వచ్చేసరికి మిత్రధర్మం పేరుతో నష్టం జరిగితే స్థానిక నాయకత్వం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అలాంటి కొన్ని చోట్ల cpi..కాంగ్రెస్ మధ్య కమ్యునికేషన్ గ్యాప్తో మున్సిపల్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది ఎదురైంది. అలాంటివన్నీ కూర్చుని మాట్లాడుకుంటే సర్దుబాటు అయిపోతాయి. కానీ… పొత్తులో ఉండాలో లేదో తేల్చుకోండని అల్టిమేటం ఇవ్వడంపై సీపీఐలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరో లెఫ్ట్ పార్టీ సీపీఎం…. నిలకడలేని నిర్ణయాలతో తలపట్టుకుని ఉంది. అలాంటి పరిస్థితుల్లో… కాంగ్రెస్లో కలిసి కొంత నిలబడగలిగామన్నది కొందరు సీపీఐ నేతల భావన. అడిగిన డిమాండ్ లు అమలుచేస్తున్నా… ఇలాంటి ధోరణి సరికాదన్నది వాళ్ళ మాట. పొత్తులో ఉన్నాం కదా అని.. అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారితే ఎలా..అనే ఫీలింగ్ ఇటు కాంగ్రెస్లో కూడా పెరుగుతోందట. సీఎం రేవంత్… కమ్యూనిస్టుల విషయంలో పాజిటివ్ గానే ఉంటున్నా.. సిపిఐ నుంచి పొత్తులపై తేల్చుకుంటాం అన్న ప్రకటన రావడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కామ్రేడ్స్ తొందర పడుతున్నారా..? అనే చర్చ రాజకీయవర్గాల్లో సైతం ఉంది.
