మూసీ చుట్టూ మళ్ళీ రాజకీయం ముసురుకుంటోందా? నేనీదరినీ…నువ్వాదరినీ.. అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో దరిన ఉండి నది మీద పొలిటికల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయా? బీఆర్ఎస్ అర్బన్ వార్కు కాంగ్రెస్ రూరల్ కౌంటర్ వేస్తోందా? నువ్విక్కడుంటే…నేనక్కడుంటానని సీఎం రేవంత్ ప్రతిపక్షానికి కొత్త అజెండా ఫిక్స్ చేశారా? ఏంటా అజెండా? మూసీ కేంద్రంగా మొదలైన కొత్త యుద్ధమేంటి? మూసీ ప్రక్షాళనపై తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. ఒకరు ఔనన్నదాన్ని ఇంకొకరు కాదనడం సర్వ సాధారణమైపోయింది. అన్నిట్లో మాదిరిగానే మూసీ విషయంలో కూడా అంతే అన్నట్టు తయారైంది. నిర్జీవంగా మారిపోతున్న మూసీకి పునరుజ్జీవం పోయడానికంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.
త్వరలో పనులు కూడా మొదలు పెట్టబోతుంది. దీంట్లో బాధితుల పక్షం అంటూ brs గాంధీ సరోవర్ సమీప ప్రాంత బాధితులకు అండగా నిలుస్తోంది. మూసీ పరివాహక బాధితులకు న్యాయం చేయాలని… ఆందోళన చేస్తోంది ప్రతిపక్షం. దీనికి సంబంధించి ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం ప్రజెంటేషన్స్తో హోరెత్తిస్తున్నాయి. ఇలా ఎత్తులకు పై ఎత్తులతో మూసీ చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. అయితే…. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. తమ రాజకీయ రణ క్షేత్రంగా ఒక్కో పార్టీ ఒక్కో జిల్లాను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్ అజెండాగా brs పావులు కదుపుతోంది. అందుకు కౌంటర్గా అధికార పార్టీ మరో ఎత్తుగడ వేయడంతో మేటర్ మాంఛి రసవత్తరంగా మారుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చేసి పేదల్ని రోడ్డున పడేస్తున్నారంటూ బీఆర్ఎస్ గళమెత్తింది.
అయితే… మూసీ కాలుష్యంతో ఎక్కువ నష్టపోతోంది నల్గొండ జిల్లానే అంటూ… దాన్ని అజెండాగా మార్చేసింది అధికార కాంగ్రెస్. నాగోల్ నుండి మొదలుకుని కృష్ణా నదిలో కలిసే వరకు మూసీ ఎక్కువగా నల్గొండ జిల్లాలోనే ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాల రైతులు ఆ నీటిని సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఇదే అంశాన్ని అజెండాగా మార్చేశారు సీఎం రేవంత్రెడ్డి. గతంలో మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర కూడా చేశారాయన. మళ్ళీ వస్తా… త్రివేణి సంగమం వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మూసీ మొదటి విడత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు సీఎం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రజల సమస్యలే కాదు.. నల్గొండ జిల్లా ప్రజల గోస కూడా చూడండని అన్నారాయన. పరిహారం, సాయం విషయంలో రాజీ లేదు. కానీ…. మూసీ ప్రక్షాళనతో నల్గొండ ప్రజల గోస తీరుతుందని చెప్పుకొచ్చారు. అటు రాజకీయంగా చూస్తే…ఇప్పటికే నల్గొండ జిల్లా కాంగ్రెస్కి కంచుకోట. ఇప్పుడు మూసీని ప్రధాన అజెండాగా మల్చుకుని నల్గొండ మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. మీరు గ్రేటర్ ఎంచుకుంటే… మేము రూరల్ ఎంచుకుంటం అన్నట్టు మారింది రాజకీయం. మొత్తం మీద ఆ విధంగా… BRS గ్రేటర్ రాజకీయ అజెండా కు… సీఎం రేవంత్ నల్గొండను తెర మీదకు తెచ్చి కౌంటర్ ఎజెండా ఫిక్స్ చేశారన్న మాట.
