Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

  • విపక్షాల దాడికి సర్కార్‌ నుంచి రియాక్షన్‌ ఉండటం లేదన్న టాక్‌
  • మాకెందుకులే అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు
  • గతంలో రెగ్యులర్‌గా గాంధీభవన్‌కు మంత్రులు
  • ఇప్పుడు ఒకరిద్దరు మంత్రుల నుంచే రియాక్షన్స్‌
Revanth

Revanth

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వ్యవహారం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉందా? ఏపని అయినా…చెబితే….. ముందుకు తోస్తే తప్ప చేయడం లేదా? ఏమున్నా సరే… ఆ నలుగురైదుగురు చూసుకుంటారులే… మనకెందుకన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? అలాంటి వాళ్ళకు ఇటీవల సీఎం రేవంత్‌ క్లాస్‌ పీకారా? చాలా మంది శాసనసభ్యులు సీఎం క్లోజ్‌ మానిటరింగ్‌లోకి వచ్చేశారా? ఎమ్మెల్యేల విషయమై కాంగ్రెస్‌లో జరగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ప్రతిపక్షం వాయిస్‌ పెరుగుతోంది. మెల్లిగా యాక్టివిటీ ఎక్కువ అవుతోంది. రోజుకో అంశాన్ని ఎత్తుకుని అధికార పక్షానికి సవాల్‌ విసురుతోంది. కానీ… అట్నుంచి మాత్రం దీటైన రియాక్షన్‌ రానవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయవర్గాల్లో. విపక్షం…. ప్రభుత్వం మీద ఎంతలా మాటల దాడి చేస్తున్నా… కాంగ్రెస్‌ వైపు నుంచి సరైన స్పందన ఉండటం లేదని మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర మంత్రుల నుండి మొదలుకుని…ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే…మాకెందుకులే అన్నట్టు ప్రతి అంశాన్ని వదిలేస్తున్నారట. ఇదే ఇప్పుడు పెద్ద మైనస్‌ అవుతోందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

మంత్రులు గతంలో గాంధీభవన్‌కు వెళ్లి ఆ రోజుకి ప్రాధాన్యత కలిగిన అంశం మీదనో.. ప్రతిపక్షం నుండి వచ్చే ఆరోపణల మీదనో స్పందించేవారు. ప్రతిపక్షం కూడా అందుకు తగ్గట్టే ఆచితూచి వ్యవహరించేది. కానీ… ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మినిస్టర్స్‌ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ ఉండటం లేదన్నది బహిరంగంగానే మాట్లాడుకుంటున్న మాట. ఏ సమస్య వచ్చినా… ఎలాంటి విషయమైనా…ఎంతసేపూ…ప్రతిదానికి సీఎం రేవంత్ రెడ్డే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు చిరాగ్గా మారుతోందట. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ చామల, ప్రభుత్వ విప్‌లు వెంకట్, వేముల వీరేశం, ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు తప్ప బయటకు వచ్చి మాట్లాడేందుకు మిగతా ఎవరికీ మనసు ఒప్పడం లేదా? లేక భయపడుతున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాల్లో.

ప్రభుత్వం ఇటీవలే విప్‌లను నియమించడంతో… వేముల వీరేశం వారంలో రెండు రోజులు మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ఒకరిద్దరు నాయకులైతే… పార్టీ ఆఫీస్‌కు రావడం మానేసి నేరుగా మొబైల్‌లో వీడియోలు తీసి పంపడానికి అలవాటుపడ్డారు. ఇలాంటి వ్యవహారాలన్నిటి మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజులుగా నజర్ పెట్టినట్టు తెలిసింది. ఎవరేం చేస్తున్నారు? ఎవరి పని తీరు ఎలా ఉందన్న సంగతిని నిశితంగా పరిశీలిస్తున్నారట. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీకి సీఎం వచ్చినప్పుడు… ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురుపడ్డారు. వాళ్ళ మీద ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏం చేస్తున్నారు మీరంతా.. మాకెందుకులే అనుకుంటున్నారా..? అంటూ గట్టిగానే అర్సుకున్నట్టు తెలిసింది.

ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకే కాదు… కనీసం మనం చేసిన పనుల గురించి అయినా మీడియా సమావేశాలు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? ప్రెస్‌మీట్స్‌ ఎలా పెట్టాలో కూడా తెలియదా..? ఏదైనా సరే… చెబితేగానీ మాట్లాడరా..? నలుగురైదుగురు MLA లు మాట్లాడితే పోయేదేముంది అంటూ గట్టిగానే క్లాస్ ఇచ్చారట. MLAల పనితీరు పై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం రేవంత్‌… ఇక పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఆ యాక్షన్‌కు ఎమ్మెల్యేల రియాక్షన్‌ ఎలా ఉంటుంది? వాళ్ళు మారతారా…? లేక ఆ నలుగురైదుగురే మాట్లాడుకుంటారులే అని ఎప్పట్లాగే ఎవరికి వారు కామ్‌ అయిపోతారా అన్నది చూడాలి.