Site icon NTV Telugu

Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు!

Congres

Congres

అత్యంత కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు కిందా మీదా పడుతోంది? మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? ఒక్కచోట కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటకుండా…. చివరికి చచ్చీచెడీ ఛైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడే ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటిది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న జిల్లాలో అధికార కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర రాజధానితో కలిసి ఉండే రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు అటు కాంగ్రెస్‌ నాయకులకు కూడా మింగుడు పడ్డం లేదట. అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన రిజల్ట్స్‌ వచ్చాయంటూ అటు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో జిల్లా నాయకుల పని తీరు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట్నుంచి పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా… నాయకులకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంవల్లే ఫలితాలు అలా వచ్చాయన్న వాదన బలంగా ఉంది. అటు కేడర్‌ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో ఎక్కడా కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్‌ దాటి సీట్లు రాలేదు.

మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దగ్గరగా వచ్చినచోట చచ్చీ చెడీ మున్సిపల్‌ ఛైర్మన్‌ పోస్ట్‌లను దక్కించుకోవాల్సి వచ్చింది. అందుకోసం రకరకాల అడ్డదారులు తొక్కాల్సి వచ్చిందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్ధులను, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్స్‌ అయినవారిని, ఇంకొన్ని చోట్ల అయితే…. చివరికి సిద్ధాంత వైరుధ్యాలున్న బీజేపీతో కూడా జత కట్టి చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుని పరువు కాపాడుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. అయితే… కొత్త, పాత నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. హస్తంలోని ఐదు వేళ్ళు ఒక్కటిగా ఉంటే… ఆ లెక్క వేరుగా ఉంటుందని, దానికి బదులు నాయకులు ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా ఉండటం వల్లే దెబ్బలు తగులుతున్నాయన్నది నాయకుల మాట.

 

ఎన్నిక ఏ రూపంలో జరిగినా మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళలకు పీఠాలు దక్కాయి. చేవెళ్ళ, మొయినాబాద్, అలియాబాద్, వికారాబాద్‌, తాండూరు, పరిగిలో మహిళలు ఛైర్‌ పర్సన్స్ అయ్యారు. ఈ అన్ని మున్సిపాలిటీల్లో సీనియర్స్‌, కీలక నాయకులు ఉన్నా…. ఎవరికి వారు పార్టీ తరపున కాకుండా, తమ వర్గం కోసం పాకులాడటంతో…. మనస్పర్థలు తలెత్తినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పెద్దల మధ్య సఖ్యత లేకపోవడమే పార్టీకి శాపం అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మున్సిపల్ ఎన్నికల్లోనే ఇలాంటి ఫలితాలు వస్తే… రేపు పరిషత్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో.

 

 

Exit mobile version