OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?

Bandi

Bandi

OTR : గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దూరంగా ఉండబోతున్నారా? ఈసారి ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదా? గత ఎన్నికల్లో పార్టీ కార్పొరేటర్స్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించారని పేరున్న బండి ఇప్పుడెందుకు దూరం అవుతారు? పార్టీలో అసలా చర్చ ఎందుకు జరుగుతోంది? అది బండి వ్యక్తిగతమా లేక పార్టీ నిర్ణయమా? తెలంగాణలో పదవీ కాలం ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్స్‌కు, గత ఎన్నికల టైంలో వివిధ కారణాలతో ఆగిన మరికొన్ని మున్సిపాలిటీలకు త్వరలోనే ఎలక్షన్స్‌ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఆ దిశగా కమలం పార్టీ కూడా గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టింది. పాత గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్‌లు, వరంగల్ , ఖమ్మం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికలలో బీజేపీ GHMC పరిధిలో, వరంగల్ లో చెప్పుకోతగ్గ సీట్లే గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎవరూ ఊహించనన్ని సీట్లు సాధించింది. అప్పట్లో పార్టీ ఆ స్థాయిలో పనితీరు కనబరచడానికి కారణం… నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ చేసిన ప్రచారం… ఆయన ప్రసంగాలేనన్న అభిప్రాయం స్థానిక కేడర్‌లో ఉంది. బండి పార్టీలో జోష్ తీసుకురావడంతోపాటు ప్రజలను పార్టీ వైపు ఆకర్షించగలిగారన్నది వాళ్ల మాట. ఆ తర్వాత జరిగిన వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. అది కూడా బండి సంజయ్ వల్లనే అనే మాట పార్టీలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో మున్సిపల్‌ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో… బండి సంజయ్ రోల్ ఏంటన్న చర్చ మొదలైంది. ఆ మధ్య జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను గెల్చుకుంది బీజేపీ. నెక్స్ట్‌ మా టార్గెట్‌ GHMC అని అప్పుడే అన్నారు బండి సంజయ్. కానీ… ఇప్పుడు మాత్రం గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఆయన ప్రచారంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గత ఎన్నికల టైమ్‌లో బండి రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి… అంతటా తిరిగే అవకాశం ఉండేది. కానీ… ఇప్పుడు ఆ ఛాన్స్‌లేదు. పైగా గ్రేటర్ పరిధిలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు ఈ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లెక్కలన్నిటినీ చూసుకుంటే….ఈసారి బండి సంజయ్ ఇక్కడ ప్రచారం చేయకపోవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే… ఇక్కడి నేతలు కొందరికి, ఆయనకు మధ్య గ్యాప్‌ కూడా ఉందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి రకరకాల కారణాలతో బండి సంజయ్ కూడా వ్యక్తిగతంగా గ్రేటర్‌లో ప్రచారంపై ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అయితే…హైదరాబాద్‌ని వదిలేసినా… వరంగల్‌లో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. పార్టీ పెద్దలకు కూడా ఇదే విషయం చెప్పినట్టు తెలిసింది. వరంగల్‌ ఇన్ఛార్జ్‌గా తీసుకొని పని చేస్తే తృప్తి అయినా ఉంటుందని కేంద్ర మంత్రి భావిస్తున్నట్టు సమాచారం. దీంతో… పార్టీ పెద్దలు ఆయనకు ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తారోనని ఆసక్తిగా చూస్తోంది కేడర్‌.

×
×
Ad