OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్‌లో రాంబాబు స్పీడ్

Ambati

Ambati

అయితే కేసు… పోతే జైలుకు… అదీ, ఇదీ కాదంటే అధినేతకు లాయల్టీ, సొంత క్యాస్ట్‌లో పాపులారిటీ. ఇదీ ఆ నేత స్టైల్‌. బహుళ లక్ష్యాలతో ఆ మాజీ మంత్రి వేస్తున్న అడుగులు పొలిటికల్‌గా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా జగన్‌తో సాన్నిహిత్యం, కాపు కనెక్ట్‌ ఫార్ములాను అప్లయ్‌ చేస్తున్న ఆ నాయకుడు ఎవరు? కొత్తగా ఏం చేస్తున్నారు? ఏపీ పాలిటిక్స్‌తో ఏ మాత్రం టచ్‌ ఉన్న వాళ్లకైనా పరిచయం అక్కర్లేని పేరు అంబటి రాంబాబు. మేటర్‌ ఏదైనాసరే… స్పష్టంగా, అందరికీ అర్ధమయ్యేలా వివరించడంలో దిట్ట. అంబటి చెప్పేది అబద్దమైనా నిజమేమోనని నమ్మాలనిపిస్తుందంటూ కొందరు సరదాగా అంటుంటారు. ద‌శాబ్దాల రాజకీయ అనుభ‌వం ఉన్న ఆయ‌న రాజకీయ ప్రయాణంలో తన ఇంటిపై జరిగిన దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. దాడి.. కేసులు.. అరెస్ట్.. బెయిల్.. ఆ తర్వాత వైసీపీ నేతల సంఘీభావంతో యాక్టివిటీ పెంచారాయన. దీంతో… ప్రతికూల పరిస్థితులను పొలిటికల్ నరేటివ్‌గా మార్చుకుంటున్నారా అన్న చ‌ర్చ మొదలైంది. అదే సమయంలో ఆయన చర్యలు కూడా అలాగే కనిపించాయి. ఆ యాక్టివిటీలో ఆసక్తికరమైన అంశం కాపు కనెక్ట్. ముద్రగడ పద్మనాభం మరణంతో కాపు రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసిందని అంటారు. అదే సమయంలో పెద్ద పాత్రలోకి తాను రావాలనుకుంటున్నారా అన్న డౌట్స్‌ కూడా వచ్చాయి చాలా మందికి. గతంలో ముద్రగడతో అంబటికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఒక వేదికపైకి తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించానని కూడా చెప్పుకున్నారాయన. దీంతో… ముద్రగడ తర్వాత.. కాపు పొలిటికల్‌ స్పేస్‌లో అంబటి యాక్టివిటీ పెంచుతున్నారా అన్న చ‌ర్చ సైతం సొంత సామాజిక‌వ‌ర్గంలోనే జ‌రుగుతోంది.

గ‌తంలో తన ఇంటిపై దాడి, కేసులు.. జైళ్లు..బెయిళ్ల ఎపిసోడ్ త‌ర్వాత అప్పుడు త‌న‌కు సంఘీభావం తెలిపిన నేత‌ల దగ్గరికి వివిధ జిల్లాల‌కు వెళ్లిమరీ కృతజ్ఞతలు చెప్పి వచ్చారాయన. ముద్రగడ మ‌ర‌ణం స‌మ‌యంలోనూ కాపు నేత‌ల‌ందరికీ ఫుల్ ట‌చ్‌లో ఉండ‌టంతో పాటు విజ‌య‌వాడ సాయికృష్ణ ఎపిసోడ్‌లో కూడా యాక్టివ్‌ రోల్‌ పోషించారు. సాయికృష్ణ త‌ల్లికి వైసీపీ కాపు నేత‌లంద‌రూ క‌ల‌సి దాదాపు 20 ల‌క్షల రూపాయ‌లు అంద‌జేయ‌టం వంటి కీల‌క ప‌రిణామాలు జరిగాయి. అలాగే… కేవలం కులానికే పరిమితం అవకుండా… పార్టీ పెద్దల దృష్టిలో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని విషయంలో చేసిన వ్యవహారం మరోసారి కేసుల దాకా వెళ్ళింది. అయినా తగ్గకుండా రాజకీయ విమర్శల వాడి పెంచడం ఆసక్తికరంగా మారింది. ఇలా….. అంబటి రాంబాబు యాక్టివిటీ మొత్తాన్ని ఒకచోట పెట్టి చూస్తే….. ప్రభుత్వంపై పోరాటం, కేసులను ఎదుర్కోవడం, కాపు వర్గంతో సంబంధాలు బలపరుచుకుని ముద్రగడ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం… వీటన్నిటికి మించి పార్టీ అధినేత జగన్‌పై తన అభిమానాన్ని బహిరంగంగా చూపించడం లాంటి లక్ష్యాలను ఏకకాలంలో చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వ్యవహారాలన్నీ విడివిడిగా కనిపిస్తున్నా… అన్నిటినీ గుదిగుచ్చి చూస్తే… లైన్‌ స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. మరీ ముఖ్యంగా వైసీపీకి లాయల్టీ విషయంలో తనకు తానే సాటి అని, జగన్‌ శ్రీరాముడైతే… తాను ఆంజనేయుడి లాంటి వాడినని చెప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. మిగతా నేతలకు భిన్నంగా షర్ట్‌ మీద వైసీపీ, జగన్ లోగోలు వేసుకోవడం కూడా ఒక రకమైన పొలిటికల్ మెసేజేనని అంచనా వేస్తున్నారు. జగన్‌తోనే నా రాజకీయ ప్రయాణం.. వైసీపీతోనే నా రాజకీయ గుర్తింపు అనే మెసేజ్‌ను స్పష్టంగా ఇవ్వాలన్న ప్రయత్నంగా భావిస్తున్నారు విశ్లేష‌కులు. జగన్ దగ్గర పార్టీ కోసం నిలబడే నేతగా, అదే సమయంలో కాపు రాజకీయ స్పేస్‌లోనూ తన ప్రెజెన్స్‌ను పెంచుకోవడం ద్వారా గట్టి నాయకుడిగా నిలబడాలన్నది ఆయన పొలిటికల్‌ కేలిక్యులేషన్‌ అయి ఉండవచ్చని అంటున్నారు.