తెలంగాణ పొలిటికల్ తెర మీద మళ్ళీ గ్లోబరీనా బొమ్మ పడిందా? ఆ సంస్థ కేంద్రంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఎటు పోతోంది? ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యేదాకా అది ఆగబోదా? నీట్ పేపర్ లీకేజీపై దేశమంతటా రచ్చ అవుతుంటే… ఇక్కడ మాత్రం ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది? రెండిటికీ ఉన్న లింకేంటి?
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేగుతుంటే…దానికి అనుబంధంగా తెలంగాణలో ఇంకో వివాదం మరోసారి తెర మీదికి వచ్చింది. దానికి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. కొడంగల్ నిరసన ర్యాలీలో గ్లోబరీనా సంస్థ ప్రస్తావన తీసుకు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ సంస్థ అని, 2019లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు సరిగా ఇవ్వలేక పోయిందని, ఆ కారణంతో 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారంటూ రివైండ్ చేశారు సీఎం. అందుకు సమాధానంగా… ట్వీట్ చేశారు కేటీఆర్. గ్లోబరీనా సంస్థకు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు ప్రస్తావించినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువునష్టం దావా వేస్తానని అన్నారాయన. అన్నట్టుగానే… పరువు నష్టం దావా వేశారు. ఇక తాజాగా ఇందిరా పార్క్ ధర్నాలో మరో అడుగు ముందుకు వేసి… అప్పటి తప్పులకు, నాకు సంబంధం ఉందని నిరూపిస్తే ఉరి వేయండి అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇటు సీఎం రేవంత్ కూడా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. పరువు ఉన్నవాడు వేసే కేసు పరువు నష్టం కేసుగానీ… కేటీఆర్ వేస్తే ఏమవుతుందంటూ సెటైరికల్గా మాట్లాడారాయన. కేటీఆర్కి చేతనైతే… CCSకి వెళ్లి.. గ్లోబరీనా మీద ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తానని కూడా చెప్పుకొచ్చారాయన. కేటీఆర్కి… జన్వాడ ఫామ్హౌజ్ భూమి ఏ రాజుల నుండి వచ్చిందో కూడా బయటకు వస్తుందని అన్నారు సీఎం. నాకు నేనుగా విచారణకు ఆదేశిస్తే… కక్ష సాధింపు అంటారు కాబట్టి..కేటీఆర్నే ఫిర్యాదు చేయమని అడుగుతున్నట్టు స్పష్టం చేశారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థేనని, ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దనప్పుడే బ్లాక్లో పెడితే సరిపోయేదని, అలా చేయకపోవడం వల్లే… ఇప్పుడు
పేరు మార్చుకుని CBSE మూల్యాంకనంలో తప్పుల తడకలు చేసేదాకా వచ్చిందని అన్నారాయన. గ్లోబరీనాపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందని, నివేదిక వచ్చాక అసలు విషయం చెప్తానంటూ స్పష్టం చేశారు రేవంత్.
దీంతో 2019లో జరిగిన ఇష్యూ మళ్ళీ తెర మీదకు వచ్చింది. గ్లోబరీనాపై… సీఎం రేవంత్ మొదలు పెట్టడం… దానికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం… కొనసాగింపుగా ముఖ్యమంత్రి మరిన్ని వివరాలు చెప్పడంతో ఇదేం అంత తేలిగ్గా పోయే వ్యవహారం కాదన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. పైగా…అప్పటి తప్పుల్లో నా పాత్ర ఉంటే ఉరి తీయండని విపక్ష నేత చేసిన కామెంట్స్ ఇంకా హీట్ పెంచాయి. దీంతో విజిలెన్స్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో, కథ ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

