Off The Record: విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కోలగట్ల వీరభద్రస్వామి సొంత పార్టీ… వైసీపీ నాయకులకైతే…. ఆయన అంతరంగం అంతుచిక్కక గందరగోళ పడుతున్నారట. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించే స్వామి…. ఇప్పుడు ఎందుకు గడప దాటటం లేదు? యాక్టివ్గా కనిపించడం లేదంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే… కొన్ని కొత్త సంగతులు తెలుస్తున్నాయట. మాజీ డిప్యూటీ స్పీకర్ తన వారసురాలి రాజకీయ భవిష్యత్ విషయమై ఆందోళనగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఒకడుగు వెనక్కేస్తున్నారన్నది ఇంటర్నల్ టాక్. ఒకప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సమావేశాలు, నిరసనలు అంటూ నిత్యం ప్రజల మధ్యనే కనిపించేవారాయన. కానీ… కొంతకాలంగా రాజకీయంగా నెమ్మదించారన్నది జిల్లాలో ఉన్న విస్తృతాభిప్రాయం. దాంతో… గతంలో కనిపించినంత చురుగ్గా ఎందుకు లేరంటూ పార్టీ వర్గాలు సైతం సమాధానాలు వెదికే ప్రయత్నంలో ఉన్నాయి. తన సహజ శైలికి భిన్నంగా… ప్రస్తుతం పార్టీ కార్యక్రమం ఉంటే హాజరవుతున్నారు… నాయకత్వం పిలిస్తే ముందుకొస్తున్నారు… తప్ప యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదు.
అయితే ఈ మౌనం వెనుక ఉన్నది రాజకీయ వ్యూహమా? లేక కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానంగానే వినిపిస్తోంది వారసత్వ వ్యవహారం. తన కుమార్తె శ్రావణి రాజకీయ భవిష్యత్తుపై కోలగట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఆమె గతంలో డిప్యూటీ మేయర్ బాధ్యతలు కూడా నిర్వహించినందున… ఇక మీదట తనకు బదులుగా కుమార్తెను పొలిటికల్గా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారట. ఆమె రాజకీయ భవిష్యత్కు బాటలు వేసే క్రమంలోనే… వైసీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చేలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్నది లోకల్ టాక్. ముఖ్యంగా…. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై కోలగట్ల కన్నుపడిందని అంటున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తె శ్రావణిని పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని, ఆ మేరకు ఇప్పుడే తనకు హామీ ఇవ్వాలని వీరభద్రస్వామి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడే ఉపయోగించుకుంటూ… తాను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నప్పుడే కుమార్తె భవిష్యత్కు బాటలు వేయాలని అనుకుంటున్నారట కోలగట్ల. అందుకే పార్టీ అధిష్టానం నుంచి హామీ కోరుతూ… ఆ విషయంలో క్లారిటీ వచ్చేదాకా కామ్ ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీ నాయకత్వం మాత్రం అలాంటి హామీలకు ఇది సమయం కాదని అంటున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో క్లారిటీ లేదు. అప్పటికి రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో తెలియదు.
ఈ పరిస్థితుల్లో… భవిష్యత్ పదవులపై చర్చించడం కంటే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని నాయకత్వం సూచిస్తున్నట్లు సీనియర్లు చెబుతున్నారు. విత్తనం వేయక ముందే పంట గురించి మాట్లాడొద్దు…. ముందు రాజకీయ పోరాటంపై దృష్టి పెట్టాలని పార్టీ ముఖ్యులు కోలగట్లకు సూచించినట్టు తెలిసింది. కానీ… ఆయన మాత్రం ఆ మాటల్ని చెవికెక్కించుకునే స్థితిలో లేరట. నాకో క్లారిటీ వచ్చేదాకా నో కాంప్రమైజ్ అన్నట్టుగానే ఉంటున్నారన్నది సన్నిహితుల మాట. దీనికి కుటుంబ పరిస్థితులు కూడా ఒక కారణమై ఉండవచ్చని అంటున్నారు వాళ్ళు. రాజకీయంగా తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యుడు ఇటీవల చనిపోవడం, అటు వారసత్వంపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ఆయన్ని ఆలోచనలో పడేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మౌనం అంటే… ఎప్పుడూ బలహీనత కాదని, కొన్ని సందర్భాల్లో అది వ్యూహమేనని చెబుతున్నారు పార్టీ నాయకులు. పరిస్థితులను అంచనా వేసేందుకు, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు కొంతమంది నేతలు ఇలాంటి ధోరణిని అవలంభిస్తారంటూ గుర్తు చేస్తున్నారు. మాట్లాడే నాయకుడికంటే మౌనంగా ఉన్న నేత గురించే ఎక్కువ చర్చ జరుగుతుందని, అందుకే తన డిమాండ్ సాధించుకునే క్రమంలో కోలగట్ల మౌనాస్త్రాన్ని వాడుతున్నారన్నది విశ్లేషకుల మాట. ఆయన డిమాండ్ విషయంలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందా? లేక కాలానికే వదిలేస్తుందా అన్నది చూడాలంటున్నారు విజయనగరం వైసీపీ నాయకులు.

