Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తూర్పు కాపు, కాళింగ, వెలమ కులాల నేతలు శాసిస్తుంటారు. పార్టీలు ఏవైనా సరే…. పదవులు మాత్రం ఈ మూడు సామాజికవర్గాల మధ్యనే తిరుగుతుంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకు తగ్గట్టే జిల్లా జనాభాలో వీరి వాటానే ఎక్కువ. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి తూర్పు కాపులు అండగా నిలబడ్డారు. దీంతో బొత్స వంటి అగ్రనేతలతో పాటు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీగా , ఎమ్మెల్యేలుగా గొర్లె కిరణ్. రెడ్డి శాంతి వంటివారు గెలిచారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులకు పెద్ద పీట వేసినప్పటికీ నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బొత్స కాపులకు అండగా నిలిచారు. కానీ… 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తేడా కొట్టింది. కాపు కులానికి చెందిన వేపాడ చిరంజీవిరావుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం, వైసీపీ వేరే క్యాస్ట్కు కేటాయించడంతో…. స్థానికంగా కారులంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఇక 24 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటలు, చంద్రబాబు హామీలు తూర్పుకాపుల మీద గట్టిగా పనిచేశాయన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. 60 శాతానికి పైగా తూర్పు కాపు సామాజిక వర్గం జనాభా ఉన్న ఎచ్చెర్ల , నెల్లిమర్ల పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు వెళ్ళాయి. అయితే ఆ సీట్లు ఇతరులకు ఇచ్చినా… కూటమిని ఆదరించారు కాపులు. కానీ… అధికారంలో వచ్చాక తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసహనం స్థానిక తూర్పు కాపుల్లో పెరుగుతోందట.
నామినేటెడ్ పోస్టుల పరంగా చూస్తే…. వివిధ కార్పొరేషన్స్లో ప్రాధాన్యత లేని డైరెక్టర్లు కాగలిగారు తప్ప చైర్మన్ పోస్టులు దక్కలేదన్నది ఆ సామాజికవర్గం నేతల అసంతృప్తి. మరోవైపు ఇదే సామాజికర్గానికి చెందిన ఉద్యోగులు సైతం వడ్డించే వాడు మనవాడు లేకపోవడంతో సరైన పోస్టింగ్స్ రాలేదని గుస్సాగా ఉన్నట్టు సమాచారం. నాడు పూలు అమ్మిన చోటే నేడు కట్టెలు అమ్మాల్సిన దుస్థితిలో ఉన్నారని, తూర్పు కాపు అధికారులకు అన్యాయం జరుగుతోందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. సుడా చైర్మన్ లాంటి పదవులు ఉన్నా… అడుగడుగునా కావాలనే ప్రోటోకాల్ సమస్యలు సృష్టిస్తున్నారన్నది వాళ్ళ ఆవేదనగా తెలుస్తోంది. ఇలా అన్ని రంగాల్లో ఇతర కులాలకు చెందిన నేతలు కీలక పదవుల్లో ఉండి తమను తొక్కేస్తున్నారన్నది తూర్పు కాపు నాయకుల భావన. ఈ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఎచ్చెర్ల గతంలో ఎస్సీ రిజర్వుడు కాగా… జనరల్ అయ్యాక కూడా తమ కోటాలో రాలేదన్న అసహనం ఉందట. ఇక కాపులు అత్యధికంగా ఉండే రాజాం, పాలకొండ రిజర్వ్ అవడం వెనక కూడా ఏదైనా మతలబు ఉందేమోనని ఇప్పుడు కొత్తగా డౌట్స్ వస్తున్నాయట ఈ సామాజికవర్గానికి చెందిన కొందరికి. పక్క జిల్లాలోని నెల్లిమర్ల, సాలూరు వంటి చోట్ల అదేపరిస్థితి ఉందని మాట్లాడుకుంటున్నారు.
ఇక ఇదే సమయంలో తూర్పు కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే…పొలిటికల్గా దెబ్బతింటున్నామన్నది లేటెస్ట్గా నడుస్తున్న చర్చ. అందుకే ఇక నుంచి తాము బలం ఉన్న చోట ఇతర కులాలకు సీట్లు కేటాయిస్తే సంఘటితంగా నిలబడాలని, అలా అయితేనే అన్ని పార్టీలు దారికొస్తాయన్న చర్చలు మొదలయ్యాయి. రేపు నియోజకవర్గాల పునర్విభజన అయితే… తమకు అన్యాయం జరక్కుండా చూడాలంటూ… పార్టీలకు అతీతంగా సమావేశమైన కాపు నేతలు తీర్మానించారు. ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగున వివక్ష ఎదుర్కొంటున్నామని చెబుతున్నామన్నది తూర్పు కాపు పెద్దల అభిప్రాయం అట. దాన్ని ఎదుర్కోవాలంటే…. పార్టీలకు, జెండాలకు అతీతంగా తూర్పు కాపులంతా ఒకే తాటిపైకి రావాలని, సామాజికవర్గ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేశారట. మా ఓట్లు కావాలి.. మా కష్టం కావాలి…. కానీ మాకు దక్కాల్సిన గౌరవం మాత్రం ఎక్కడ?”అనే ప్రశ్నను సందిస్తున్నారు. ప్రతి అంశంలో సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడే సీఎం చంద్రబాబుకు ఇకడ తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కూటమి పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి కాపు నేతలు సైతం లోలోన రగిలిపోతున్నారట. పార్టీల్లో, ప్రభుత్వంలో విధానాలు ఇలాగే కొనసాగితే ముందు ముందు మేమేంటో చూపిస్తామన్నది సిక్కోలు తూర్పు కాపు నాయకుల మాట.

