Off The Record: ట్రెండ్కు తగ్గట్టు కాషాయం ట్యూన్ అవుతోంది. పరిస్థితులు చేజారకుండా… ముందే జాగ్రత్త పడుతూ… బీజేపీ మరోసారి అధికార పీఠానికి నిచ్చెన వేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా…జెన్ జీకి దగ్గర కావాలని ప్రధాని మోడీ కమలం నేతలకు సూచించారు. దీంతో… నేటి తరంతో మమేకమై…నేరుగా టట్లో ఉండాలని పార్టీ నేతలు కూడా డిసైడ్ అయ్యారట. యూనివర్సిటీలకు వెళ్ళాలని ప్రధాని చేసిన సూచనను తూచా తప్పకుండా పాటించే దిశగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే విద్యార్థి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారట. RSS పరివార క్షేత్రమైన ఏబీవీపీ విద్యా రంగంలో పని చేస్తోంది. స్టూడెంట్ ఇష్యూస్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినా సరే… అది సరిపోదంటూ… బీజేపీ, అనుబంధ మోర్చాల నాయకులు క్యాంపస్ బాట పడుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… పార్టీనే నేరుగా విద్యార్థులకు దగ్గరగా ఉండాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోందంటున్నారు. వాళ్లను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్, విపక్షాలు కార్యక్రమాలు చేస్తున్నాయని, మనం కూడా అదే రేంజ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే…. విద్యార్థి, యువత కేంద్రంగా కార్యక్రమాలు చేయక తప్పదని డిసైడయ్యారట కమలం లీడర్స్.
ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలపై ఆ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. కాలేజీలకు వెళ్లి విద్యార్థుల సంతకాలు సేకరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు రెండు రోజుల దీక్ష చేశారు. దానికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలించారు. అలాగే.. జీఓ 97 కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి బీజేపీ మద్దతు తెలిపింది. వారిని కలిసేందుకు వెళ్ళాలనుకున్న రామచందర్రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే… ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వింగ్లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. యువ క్రీడాకారులు, విద్యార్థులు పార్టిసిపేట్ చేసిన ఖేలో ఇండియాకు అటెండ్ అయ్యారాయన. ఈ రకంగా… రకరకాల కార్యక్రమాలతో… జెన్ జీకి దగ్గరగా ఉండేందుకు కాషాయ లీడర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ పట్ల ఆ తరంలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పెద్దగా పట్టించుకోని కొందరు నాయకులు కూడా… ఇప్పుడు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటున్నారట. సోషల్ వీధుల్లో ఎప్పుడూ కనిపించని కాషాయ లీడర్స్ కొందరు ఇప్పుడు పోస్ట్లు పెడుతుండటంతో… కుర్రోళ్ళ దెబ్బ బాగానే కనిపిస్తోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. బీజేపీ యువ ఆలోచనల్ని ఆ వర్గం ఎంత వరకు రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

