Off The Record: తెలంగాణ కాషాయదళంలో కొత్త దృశ్యం. కార్యకర్తలు హ్యాపీగా ఫీలయ్యే సన్నివేశం. ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చుని, మాట్లాడుకుని, భోంచేయడం పార్టీ వర్గాలకే కొత్తగా ఉందట. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. విశ్వేశ్వర్రెడ్డి సంగతి ఎలా ఉన్నా…. సంజయ్, ఈటల మధ్య వ్యవహారం మాత్రం ఉప్పు నిప్పులాగే ఉండేదని బీజేపీ వర్గాలే చెబుతాయి. అలా.. ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్ళు ఇప్పుడిలా మనం మనం కాషాయం అనడం వెనక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీ వర్గాలే ఆరా తీస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్న మూడు జిల్లాల పార్టీ అధ్యక్ష పదవులు భర్తీ అవడం, ఆ మూడు జిల్లాలకు ఎంపీలు ముగ్గురూ తాము అనుకున్న వాళ్ళకే పదవులు ఇప్పించుకోగలగడం కూడా చర్చకు వస్తోంది. దీంతో… ఎవరికి వారు పంతం నెగ్గించుకున్నారా? ముగ్గురూ కలిసి మాట్లాడుకున్నాకే జిల్లాల కొత్త అధ్యక్షుల నియామక ప్రకటన వచ్చిందా అని కూడా మాట్లాడుకుంటున్నారు టీజీ బీజేపీ నాయకులు..
తెలంగాణలో బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. అందులో 36 జిల్లాల అధ్యక్షుల నియామకం ఎప్పుడో పూర్తయింది. ఒక జిల్లా అధ్యక్షుడిని ఆ తరవాత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒత్తిడితో తొలగించారు. దీంతో మొత్తం 3 జిల్లాల అధ్యక్ష పదవులు నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయి. కరీంనగర్లో బండి సంజయ్, మేడ్చల్ అర్బన్లో ఈటల రాజేందర్ తమ వారికే పదవులు కావాలని పట్టుబట్టడంతో ఆ రెండు జిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో పీటముడి పడింది. ఈటల సూచించిన వ్యక్తికి కాకుండా వేరే ఎవరికైనా ఇవ్వాలంటూ మేడ్చల్ అర్బన్ బీజేపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో.. అది ఎంతకీ తెగకుండా జీడిపాకం సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో…. సడన్గా బుధవారం సీన్ మారిపోయింది. ఆ మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ. అందులోనూ… ఆ ఎంపీలు సూచించిన వ్యక్తులనే అపాయింట్ చేయడం చర్చనీయాంశమైంది. లేటైనా… లేటెస్ట్గా ఎంపీలు తాము అనుకున్న వారికే పదవులు ఇప్పించుకుని పంతం నెగ్గించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆ మూడు జిల్లాల అధ్యక్ష పదవుల నియామక ప్రకటనకన్నా ముందు…. ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బండి సంజయ్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో వాళ్ళతో పాటు పార్టీ సీనియర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి భోజనం చేశారు కూడా. దీంతో… అక్కడే ఏదో జరిగి ఉంటుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ వర్గాల్లో. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండటంతో పాటు ఎంపీల ఇళ్ళకు వెళ్తున్నారట. ఆ తర్వాతే బండి ఇంట్లో భోజనం, జిల్లా అధ్యక్షుల ప్రకటనలు జరిగాయని అంటున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసేలా అభయ్ పాటిల్ రాయబారం నెరిపి ఉంటారన్న గుసగుసలు పార్టీ లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారకులు ఎవరైనా… ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమేనని అంటున్నాయి బీజేపీ వర్గాలు.

