Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాకముందే… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాతావరణం వేడెక్కుతోంది. కొందరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి. వీరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరోవైపు మేమేం తక్కువ అంటూ ఇద్దరు మహిళా నేతలు కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పెనుకొండ వేదికగా పావులు కదుపుతూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. వాస్తవంగా ఉషా శ్రీచరణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని వీడి పెనుకొండకు వచ్చినప్పుడే ఈ వార్ మొదలైంది. అప్పుడు ఉష మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో ఓటమి చవి చూసింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సవితకు మంచి క్రేజ్ ఉండటంతో విజయం సాధించడంతో పాటు మంత్రి అయ్యారు. అయితే… 2024 ఎన్నికల తర్వాత పెనుకొండ నియోజకవర్గ వైసీపీలో ఆధిపత్య పోరు కనిపించింది.
ఫైనల్గా… ఇక్కడున్న శంకర్ నారాయణను పూర్తిగా సైడ్ చేసి.. ఉషా శ్రీచరణ్ దూకుడు పెంచారు. అదే టైంలో ఆమె తన టార్గెట్ను పక్కాగా ఫిక్స్ చేసుకున్నారట. తన వన్ అండ్ ఓన్లీ టార్గెట్ మంత్రి సవిత అంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే…సవిత గురించి తప్ప.. వేరే ఏ విషయాల గురించి మాట్లాడటం లేదు మాజీ మంత్రి. ఇటు సవిత మాత్రం మంత్రి అవకముందు నుంచే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా…. ఆయన పై ఒక రేంజ్లో ఫైర్ అవుతూ రాష్ట్రంలో బాగానే ఫోకస్ అయ్యారు. జగన్ టార్గెట్గా సవిత చేసిన విమర్శలు, మాట్లాడిన మాటలు ఆమె గెలుపునకు, పొలిటికల్ లైమ్లైట్లోకి రావడానికి బాగానే ఉపయోగపడ్డాయన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. కానీ.. మంత్రి ఎప్పుడు జగన్ మీద కామెంట్ చేసినా.. అందుకు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మాత్రం ఉషా శ్రీచరణే. ఈ క్రమంలో ఇటీవల మంత్రి సవిత కాస్త డోస్ పెంచారు. మెగా డీఎస్సీపై వైసీపీ లేవనెత్తుతున్న అంశాల మీద చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇస్తున్నారు సవిత. డీఎస్సీ అక్రమాల మీద సీబీఐ ఎంక్వైరీ చేయించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే…. అసలు సీబీఐ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదంటూ డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేశారు మినిస్టర్. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కోరింది, వద్దన్నది కూడా జగన్మోహన్ రెడ్డినేనని, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోయినప్పుడు సీబీఐని అడ్డుకున్నది కూడా జగనేనని చెప్పుకొచ్చారామె.
ఇంకో వైపు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని పెనుకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉష కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. మంత్రి సవిత తోడబుట్టిన సోదరులనే మోసం చేసిందని, వాళ్ళ ఆస్తి కాజేసిందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి. అలాగే పెనుకొండలో మంత్రి మనుషులు ప్రతి బాటిల్ మీద పది రూపాయలు తాగేస్తున్నా… ఆమె అసలు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతూ.. బెల్టు షాపులు నడిపిస్తున్న నీకు జగన్ గురించి మాట్లాడే నైతికత ఉందా అంటూ మంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారామె. ఇటు మంత్రి, అటు మాజీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరి వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. వీరిద్దరూ ఉన్నట్టుండి అంత పీక్ స్టేజ్ కి వెళ్లి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి కారణం స్థానిక ఎన్నికలేనా లేక అంతకు మించిన కారణాలున్నాయా అన్న చర్చలు జరుగుతున్నాయి పెనుకొండలో. లోకల్ బాడీస్లో తమ క్యాడర్కు బూస్ట్ ఇచ్చేందుకే ఇద్దరూ డోస్ పెంచినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఈ సారి పెనుకొండ పల్లె పోరు రసవత్తరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

