Off The Record: నంద్యాల జిల్లాలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ వ్యవహారాలైనా, అధికారిక కార్యక్రమాలైనా, పార్టీ ప్రోగ్రామ్స్ అయినా సరే… రచ్చ జరక్కపోతే… ఆ కార్యక్రమం నిర్వహించిన ఫీల్ ఉండటం లేదని సొంత పార్టీలోనే సెటైర్స్ పడుతున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. తాజాగా జరిగిన నంద్యాల జిల్లా స్థాయి పార్టీ సమావేశాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆ సందర్భంగా వినిపించిన కోవర్ట్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరైన ఈ సమావేశానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అటెండ్ అవలేదు. పైగా పార్టీలో కోవర్ట్లు ఉన్నారని ఆమె అనడం కలకలం రేపింది. జిల్లాకు చెందిన మంత్రులు ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి వంటి నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ… సమావేశానికి గైర్హాజరైన భూమా అఖిల బయట మీడియాతో చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. ఆ సమావేశంలో పాల్గొనకపోవడం సంతోషంగా ఉందని అన్నారామె. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను పక్కనబెట్టి, కోవర్టులను ముందుకు తీసుకువచ్చి మాట్లాడించడం కార్యకర్తలకు ఆమోదయోగ్యం కాదని అన్న మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కూడా హెచ్చరించారు అఖిలప్రియ. పార్టీలో ఒకవైపు కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉంటే మరోవైపు కోవర్టులు ఉన్నారని అన్నారు మాజీ మంత్రి. పార్టీ కోసం పని చేయని వ్యక్తులు స్టేజీలపైకి ఎక్కి మైకులు పట్టుకుని మాట్లాడటం సరికాదన్నారామె. పని చేసే వాళ్లు, చేయని వాళ్లు ఒకే వేదిక మీదికి వస్తే విలువ ఏముంటుందన్నది అఖిల క్వశ్చన్. రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని, ఈ పరిస్థితిని సరిదిద్దాలని అధిష్టానానానికి సూచించారు. పార్టీ అధినాయకత్వం కోవర్టులను గుర్తించి తప్పక చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందంటూ ముక్తాయింపునిచ్చారు. దీంతో… మాజీ మంత్రి ఎవర్ని ఉద్దేశించి అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు? ఆమె టార్గెట్ ఎవరంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వేదిక మీద మాజీ మంత్రితో విభేదించే నాయకులు పలువురు ఉండటంతో…వారిలో ఎవర్ని ఉద్దేశించి కోవర్ట్ వ్యాఖ్యలు చేశారన్నది ఆసక్తి కరంగా మారింది. ఆ విషయంలో ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నా… ఎక్కువ మంది మాత్రం ఏవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారట.
అఖిలకు , ఏవీకి మధ్య విబేధాలు, వివాదాలు, కొట్లాటలు, కేసుల గురించి అందరికీ తెలిసిందే. ఆయన పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని వేదికపై మొదటి వరుసలో కూర్చోబెట్టారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితను ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ పంపిన జాబితాలో ఆయన పేరు వుందని, అందుకే కార్యక్రమానికి, వేదికపైకి పిలిచామని చెప్పారట చరిత. అటు ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ గ్రూపు రాజకీయాలను ప్రస్తావించారు. అందరిని కలుపుకొని వెళ్లాలని, గ్రూపు రాజకీయాలు పెట్టుకుంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీరు కూడా నష్టపోతారని అన్నట్టు తెలిసింది. ఆ సంగతి ఎలాఉన్నా… అఖిల ప్రియ కోవర్ట్ వ్యాఖ్యల చుట్టూనే ఎక్కువ డిస్కషన్ నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి అంతలా ఏం చేశారంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారట చాలామంది నేతలు. కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మంత్రి ఫరూక్పై ఆటో నగర్ విషయంలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇపుడు భూమా అఖిల ఏవీ సుబ్బారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు. ఈ రకంగా మొత్తమ్మీద నంద్యాల టీడీపీలో వరుస వివాదాలు పెరుగుతుండగా….. అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

