Off The Record: లోకల్‌-నాన్‌లోకల్‌ రగడ.. మల్కాజ్‌గిరి బీజేపీలో కుంపట్లు..!

Bjp

Bjp

Off The Record: మల్కాజిగిరి నియోజకవర్గం మినీ ఇండియా లాంటిది. అన్ని వర్గాల ప్రజలుండే మల్కాజిగిరికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని తేలికగా తీసుకోవు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రామచందర్ రావు చూస్తున్నారట. అయితే రామచంద్రరావును నాన్‌ లోకల్‌ ముద్ర వెంటాడుతోంది. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని కొందరు క్యాంపైయిన్‌ మొదలుపెట్టారు. బీజేపీ OBC మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న జిల్లాల రవితోపాటు మరికొందరు అక్కడ BCలకు టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కుంపట్లు రాజేస్తోంది. ఈ డిమాండ్‌తో నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు పార్టీలో సెగలు రేపుతున్నాయి.

Read Also: Off The Record: శ్రీశైలం ఆలయ పాలకమండలిలో రచ్చ రచ్చ..!

పార్టీ బలోపేతానికి బిజెపి ఈ మధ్యే సంస్థాగతంగా కొన్ని నియామకాలు చేపట్టింది. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ నేత ఎన్‌వీఎస్‌ సుభాష్‌ను పాలక్‌గా నియమించింది. ప్రబారీగా మరో నాయకుడు బుచ్చిరెడ్డిని వేశారు. నెలలో మూడు రోజులు నియోజకవర్గంలో ఉండాలని పాలక్‌లను ఆదేశించారు కూడా. ఇంకా ఇప్పటిదాకా సుభాష్ నియోజకవర్గానికి రాలేదు. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం సూచిస్తారో అన్నది ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో జిల్లాల రవి సొంతంగా ఆఫీసు తెరిచి పాదయాత్ర జరపడంతో చర్చగా మారింది. వచ్చే ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల ఈ నియోజకవర్గ పరిధిలో బండి సంజయ్‌ కూడా పాదయాత్ర చేశారు. మల్కాజ్‌గిరిలో సానుకూల వాతావరణం ఉందనేది కమలనాథుల అభిప్రాయం. ఇలాంటి తరుణంలో కొత్త కుంపట్లు రాజుకోవడం బీజేపీలో కలకలం రేపుతోందట.