Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?

  • కొండా ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు?..
  • చిన్నారెడ్డిపై చర్యలకు బ్రేకులు పడ్డాయా?..
  • తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాల్లో సరికొత్త సందేహాలు..
  • ఇద్దరి మీద కఠిన చర్యలకు క్రమశిక్షణ సంఘం సిఫారసు..
  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో కేసీ వేణుగోపాల్‌..
  • సెప్టెంబర్‌ రెండున ఢిల్లీ తిరిగి రాబోతున్న కేసీ..
  • కొండా మురళి రాయబారం నడిపినా నో చెప్పిన భట్టి..
  • సెప్టెంబర్‌ 2 తర్వాతే ఢిల్లీలో ఫైల్‌ ఓపెన్‌..
Otr Konda Surekha

Otr Konda Surekha

Off The Record: పాజిటివో, నెగెటివో… పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడేది ఎప్పుడు..? చిన్నారెడ్డిపై చర్యలకు బ్రేకులు పడ్డాయా..! వాళ్ళిద్దరి విషయంలో అధిష్టానం నిర్ణయం ఏంటా అని ఎదురు చూస్తున్న వాళ్ళకుటెన్షన్ తప్పదా..? ప్రస్తుతం ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాలు. మంత్రి పదవి నుండి కొండా సురేఖను, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించాలంటూ క్రమశిక్షణా సంఘం సిఫారసు చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా…నివేదికను ఎఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కి పంపించారు. ఐతే… స్టేట్‌ నుంచి సిఫారసులు వెళ్లాయిగానీ… పదవుల నుండి తప్పించాలంటే అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సరిగ్గా అక్కడే ఎపిసోడ్‌లో బ్రేక్‌ వచ్చిందట.

పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే నేత kc వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 2న ఆయన ఢిల్లీ తిరిగి వస్తారు. ఆ తర్వాతనే కొండా, చిన్నారెడ్డికి సంబంధించిన ఫైల్‌ అధిష్టానం దగ్గర ఓపెన్‌ అవుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు విరామం అలాగే కొనసాగుతుందట. మంత్రి కొండా సురేఖ తరుపున ఆమె భర్త మురళి ఇప్పటికే రాయబారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వివరణ ఇచ్చుకున్నా… ఆయన అందుకు సుముఖంగా లేరని చెప్పుకుంటున్నారు. క్రమ శిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత…. తాను జోక్యం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇలాంటివి మళ్లీ మళ్ళీ రాకుండా… మొత్తంగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అధిష్టానం భావిస్తోందట. అందుకే యాక్షన్‌ తీసుకోవాల్సిందేనన్న వత్తిడి కూడా మరోవైపు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో… ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… సెప్టెంబర్ 2 వరకు వేచి చూడాల్సిందేనన్నది ఏఐసీసీ వర్గాల మాట.