Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏదో ఒకటి తేల్చాకే … స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. అయితే అంతకంటే ముందే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగే అవకాశం ఉండటం సొంత పార్టీలోనే పోటీని పెంచినట్టు చెప్పుకుంటున్నారు. బరిలో దిగేందుకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదన్న చర్చను లేవనెత్తారాయన. అ దిశగా వత్తిడి పెంచేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తిస్తున్నారు అంజన్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎటువెళ్లినా… అంజన్ కుమార్ యాదవ్ పేరుతో పోస్టర్స్, కటౌట్ల హంగామానే కనిపిస్తోంది.
Read Also: Off The Record: అక్కడ జనసేనలో నామినేటెడ్ చిచ్చు.. మూకుమ్మడిగా పవన్ దృష్టికి..
యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ కూడా పోటీపడుతున్నా… హడావుడి అంతా అంజన్ టీంలోనే కనిపిస్తోంది. ఇక రెడ్ల వైపు నుంచి నుంచి సీఎన్ రెడ్డి కూడా సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ప్రచారాన్ని కూడా అదే తరహాలో నిర్వహిస్తున్నారాయన. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు కటౌట్లు హోర్డింగ్స్తో ఆయన కూడా తనవైపు దృష్టి మళ్ళించుకునే ప్లాన్లో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. బీసీ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ పోటీపడుతుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎన్ రెడ్డి ఒక్కరే ఇప్పటివరకు బయటకు వచ్చారు. బీసీ కోటాపై తీవ్ర చర్చ జరుగుతున్న ఈ సందర్భంలోనే సీఎన్ రెడ్డి గట్టిగా ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ మీద కన్నేశారన్న సమాచారం అందుతోంది. బహిరంగ చర్చ కాకపోయినా పార్టీలో నాయకుల మధ్య అంతర్గత చర్చలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఇదే. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా…
ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ మాత్రం కాక రేపుతోంది. పోటాపోటీ హోర్డింగ్స్, ప్లెక్సీలు హీట్ పెంచుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా వీటన్నిటినీ గమనిస్తూనే ఉన్నారట. ఎవరి ప్రయత్నాలు వాళ్ళని చేసుకోనివ్వండి, ఎవరేం చేసినా… అంతిమంగా బెనిఫిట్ అయ్యేది పార్టీనే కదా అన్న ఫీలింగ్లో ఉన్నారట పెద్దలు. సహజంగానే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి గల్లీలో ఎవరి గోల వాళ్ళను చేయనివ్వండన్నది గాంధీభవన్ ఇన్సైడ్ టాక్.
