Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
- గజ్వేల్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రమే..
- గత ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ గెలుపుతో పుంజుకుంటామన్న ఆశలు..
- 2009లో చివరిసారిగా కాంగ్రెస్ తరపున నర్సారెడ్డి గెలుపు..
- 2023లో మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితం..
- ప్రస్తుతం గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్న నర్సారెడ్డి..
- తుప్రాన్ మార్కెట్ కమిటీ ప్రకటనతో మరోసారి భగ్గుమన్న విభేదాలు..
- బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఎలాగంటూ అసంతృప్తి..
- నర్సారెడ్డి పదవుల్ని అమ్ముకుంటున్నారని సొంత నేతల ఆరోపణ..
- డైరెక్ట్గా పీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ఫిర్యాదు..
- రాజీనామా లేఖలతో గాంధీభవన్కు 50 మంది..
- కేసులు పెట్టిన వాళ్ళకే పదవులు ఇస్తే ఇక పార్టీలో మేమెందుకని ప్రశ్న..
- రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అంతంత మాత్రం. 2009 తర్వాత ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచాక అయితే ఇక చెప్పేపనేలేదు. ఆయన సీఎం అయ్యాక జరిగిన ఏ ఎన్నికలోనూ లోకల్గా ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా…. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో… తిరిగి పుంజుకుంటామని సంబరపడ్డారు హస్తం కార్యకర్తలు. తీరా…. ఇప్పుడు చూస్తే మొత్తం తేడా తేడాగా ఉందని అంటూ వాళ్ళే అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ల గోలతో నిత్యం ఏదో ఓ వివాదం నియోజకవర్గంలో పార్టీని పట్టిపీడిస్తోందని అంటున్నారు. గజ్వేల్లో నర్సారెడ్డి చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయనకి టికెట్ నిరాకరించడంతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ.. 2018 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ తరపునే ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు నర్సారెడ్డి.
అయితే…. పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటివరకు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నర్సారెడ్డికి గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు దక్కాయి. మరోవైపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో… అప్పుడంతా పార్టీ కోసం పనిచేసిన నాయకులు నామినేటేడ్ పోస్టులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. గజ్వేల్, వంటిమామిడి, కొండపాక, సిద్దిపేట జిల్లా పరిధిలో ఉండగా తుప్రాన్ మార్కెట్ కమిటీది మెదక్ జిల్లా లిమిట్స్. సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు మార్కెట్ కమిటీలను ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా తుప్రాన్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించింది ప్రభుత్వం. ఆ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ…. 30 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్నవారికి కాకుండా… బీఆర్ఎస్ నుంచి కొన్ని నెలల క్రితం జంప్కొట్టి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు. ఇది పూర్తిగా డబ్బులు చేతులు మారిన వ్యవహారమేనని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి గతంలోనూ నామినేటేడ్ పోస్టులను అమ్ముకున్నారని, తాజాగా తుప్రాన్ మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని లక్షల రూపాయలకు బేరం పెట్టేశారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నర్సారెడ్డి నియోజకవర్గంలో వసూళ్లకు అలవాటు పడ్డారని, ఏ నాయకుడు ఎక్కువ డబ్బులిస్తే వారికే పదవులు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
పదవులు ఆశించిన నాయకులు, ఇతర నామినేటెడ్ పోస్టులకు కూడా కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకుని ఇచ్చారంటూ మండిపడుతున్నారు. తుప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శరణ్య భాస్కర్ రెడ్డికే వస్తుందని మొదట్నుంచి భావించినా… చివరి నిమిషంలో కీర్తన విఠల్ రెడ్డికి ఇప్పించడం వెనక లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందన్నది వాళ్ళ ఆరోపణ. దానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ మెట్లు ఎక్కారు లోకల్ లీడర్స్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నామంటూ…. రిజైన్ లెటర్స్తో సుమారు 50 మంది వరకు వెళ్ళగా….తొందరపడొద్దని పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్టు తెలిసింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, నిజంగానే నర్సారెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో రాజీనామా చేస్తామన్నవాళ్ళు వెనక్కి తగ్గారట. అయినా… అక్కడితో ఆగకుండా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కూడా కలిసి నర్సారెడ్డి వల్ల అన్యాయం జరుగుతోందని వాపోయినట్టు సమాచారం. పార్టీని నమ్ముకుని కష్టపడి, బీఆర్ఎస్ హయంలో అక్రమ కేసులను సైతం ఎదుర్కొంటే… తమపై కేసులు పెట్టిన వ్యక్తికే ఇప్పుడు పదవి ఇచ్చారని, ఇక పార్టీలో మేమెందుకని అవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. నర్సారెడ్డి ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో నష్టం జరగుతుందని, ఆయన పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడంతో ఎవరి దారి వారు చూసుకునే ముప్పు ముంచుకొస్తోందని వాపోతోందట లోకల్ క్యాడర్ . గజ్వేల్ కాంగ్రెస్లో ఇదేం కొత్త కాదు. గతంలోనూ పార్టీలో బహిరంగ కుమ్ములాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సొంత నేతలే పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో రేగిన కార్చిచ్చుని ఆపకపోతే… ఆ మంట ఎంతవరకైనా వెళ్ళవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
-
Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!