NTV Telugu Site icon

Off The Record: అధికార పార్టీ బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడిందా?

Brs Party

Brs Party

అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడిందా? ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీల పంచాయితీ ఉండగానే.. కొత్తగా మరో రగడ మొదలైందా? కొంతమంది జడ్పీ చైర్మన్ల తీరు చర్చగా మారిందా? జిల్లాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం ఏం చేయబోతుంది?

జడ్పీ ఛైర్మన్లు వర్సెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కట్టబెడుతూ వస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా స్థాయిలో పదవుల్లో నేతలకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధంగా పలు నియెజకవర్గాల్లో పదవులు దక్కించుకున్న వారికి.. స్థానిక ఎమ్మెల్యేలకు ఎంతో కొంత గ్యాప్ ఉందనేది విశ్లేషకుల మాట. రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలకు మధ్య నియెజకవర్గాల్లో పోటా పోటీగా అడుగులు ఉంటున్నాయనే చర్చ ఉంది. ఈ పోరును కట్టడి చేసే పనిలో పార్టీ ఉండగానే.. జడ్పీ చైర్మన్ల నుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయట.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వస్తారని ఎమ్మెల్యేల కలవరం
తెలంగాణలోని పలు జిల్లాల జడ్పీ చైర్మన్లకు.. ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని అడపాదడపా బయట పడుతూనే ఉంది. ఇవి వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందిగా మారతాయా అని కలవర పడుతున్నారట నాయకులు. షెడ్యులు ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. తాజా పరిణామాలపై ఏం చేయాలో లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాధ్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ విజయ, నిజమాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, వికరాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాధోడ్ జనార్దన్ తదితరులపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కడ పోటీకి వస్తారో అని స్థానిక ఎమ్మెల్యేలు కలవర పడుతున్నారట.

జడ్పీ ఛైర్మన్‌ పోస్టు తమ నియోజకవర్గానికి వద్దని వేడుకోలు
ఒకప్పుడు తమ నియోజకవర్గానికి జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇస్తామంటే లోకల్‌ ఎమ్మెల్యేలు ఎగిరి గెంతేసేవారు. జడ్పీటీసీల్లో తమ అనుచరులను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు పెద్దస్థాయిలో లాబీయింగ్‌ చేసేవాళ్లు. జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య ఈ అంశంపై పోటీ నెలకొనేది. కానీ.. రాజకీయ పరిస్థితులు మారడంతో.. జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇస్తామంటే ఎమ్మెల్యేలు మాకొద్దు బాబోయ్‌ అని ఆమడ దూరం పరిగెత్తే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నాయి పార్టీ వర్గాలు. తమ నియోజకవర్గానికి జడ్పీ ఛైర్మన్‌ పోస్టు రాకుండా ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ నడిపారట. మాకు తప్ప ఇంకే నియోజకవర్గానికి ఇచ్చినా ఫర్వాలేదని పార్టీ పెద్దలకు చెప్పేశారట. దాంతో ఆశ్చర్యపోవడం పార్టీ పెద్దల వంతైంది. ఈ ఘటనలో చివరికి ఎమ్మెల్యే పంతమే నెగ్గింది. జడ్పీ ఛైర్మన్‌ పీఠం వాళ్లకు కాకుండా వేరే నియోజకవర్గానికి దక్కింది.

ప్రొటోకాల్‌ విషయంలో ఎమ్మెల్యే కంటే జడ్పీ ఛైర్మన్‌కే ప్రాధాన్యం
జడ్పీ ఛైర్మన్‌ విషయంలో ఈ స్థాయిలో జడుసుకోవడానికి కారణాలు ఉన్నాయట. ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్యే కంటే జడ్పీ ఛైర్మన్‌కు ప్రాధాన్యం ఎక్కువ. దీంతోపాటు భవిష్యత్‌లో ఎమ్మెల్యే టికెట్‌కు పోటీ రావొచ్చనే భయం మరొకటి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని జడ్పీ ఛైర్మన్‌ పదవి నియోజకవర్గానికి ఇస్తానన్నా వద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్లతో ఉన్న పంచాయితీలను గుర్తు చేస్తూ.. అలాంటి పరిస్థితి తమకు ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారట. రానున్న రోజుల్లో ఇది ఇబ్బందిగా మారే ప్రమాదం ఉండటంతో పార్టీ పెద్దలు సైతం తీవ్రంగానే పరిగణిస్తున్నారట. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు సమాచారం.