Off The Record : మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే…. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే… పెద్దగా ఘాటు రియాక్షన్స్ ఏమీ లేకుండా సైలెంట్ అయ్యారామె. ఆలోచించి… భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పారు. ఐతే.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు ఆమె మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయ్యాక… జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. మంత్రి పదవి లేకున్నా… ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు అటెండ్ కావచ్చు. కానీ…ఈ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి…అటువైపు వెళ్ళకుండా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు కొండా సురేఖ.
సభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదామె. అలాగే సీఎల్పీ మీటింగ్కు కూడా దూరంగానే ఉన్నారు. దాంతో… ఇది నిరసన తెలిపే క్రమంలో భాగమా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో నిన్నటిదాకా మంత్రి హోదాలో అటెండ్ అయిన చోటికి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా రావడానికి ఇబ్బంది పడుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. కారణం ఏదైనా… ఇప్పటికైతే సభకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారట సురేఖ. తన మాజీ osd సుమంత్కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ… పోలీసులు వేధిస్తున్నారన్న ఫీలింగ్లో ఆమె ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కొండా సురేఖతో మాట్లాడి సుమంత్ ఎపిసోడ్పై వాకబు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వమని కూడా సూచించారట. మరోవైపు ఇన్నాళ్ళు కొండా సురేఖ చూసిన శాఖలు.. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోకి వెళ్తాయి. మంత్రులకు కేటాయించని శాఖలు పూర్తిగా సీఎం పర్యవేక్షణలోకి వెళ్ళడం ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలో రేపు విస్తరణ తర్వాత కొందరి పోర్ట్ఫోలియోలు మారే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

