Bhuma Akhila Priya : అడ్డా మార్చేస్తే.. రాజకీయంగా లక్ కలిసివస్తుందనే లెక్కల్లో ఉన్నారట మాజీ మంత్రి. అక్కడ ప్రత్యేకంగా ఆఫీసు తెరుస్తున్నారట. ఇదంతా వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో భాగమా? ఇంతలో మాజీ మంత్రిపై మరో మాజీ మంత్రి కుమారుడు ఎందుకు కస్సుమంటున్నారు? లెట్స్ వాచ్..!
ఆళ్లగడ్డ, నంద్యాల. భూమా ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాలు అడ్డా. గత ఎన్నికల్లో ఈ రెండుచోట్ల భూమా ఫ్యామిలీకి ఓటమి తప్పలేదు. భూమా నాగిరెడ్డి నంద్యాలలో.. శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో పోటీ చేసేవాళ్లు. తర్వాతి కాలంలో వారి కుమార్తె భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డను ఎంచుకుంటే.. వారి బంధువు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో పాగా వేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందనే ఆలోచనలో అనుచరులు, టీడీపీ కేడర్ ఉండగా.. అఖిలప్రియ కదుపుతున్న పావులు ఆసక్తి కలిగిస్తున్నాయి. నంద్యాలలో కొత్తగా ఆఫీసు పెట్టుకోవాలనే ఆలోచనలో అఖిలప్రియ ఉన్నారట. నంద్యాల భూమా ఫ్యామిలీకి కొత్త కాకపోయినా.. అక్కడ ఆఫీసు పెట్టుకోవడంలో తప్పు లేకపోయినా.. ఈ సమయంలో మాజీ మంత్రి ఎత్తుగడే రకరకాల చర్చలకు ఆస్కారం కల్పిస్తోంది.
భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆ కుటుంబానికి నంద్యాలకు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం నడుస్తోంది. 2017 ఉపఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక.. 2019లో ఇక్కడ టీడీపీ ఓడిన తర్వాత ఈ చర్చ మరింత జోరందుకుంది. గతంలో అఖిలప్రియ మంత్రిగా పనిచేసినా ఫోకస్ అంతా ఆళ్లగడ్డపైనే పెట్టారనే అభిప్రాయం నంద్యాలలోని అనుచరుల్లో ఉందట. ఆ విషయం గమనించారో ఏమో.. ఇప్పుడు ఆఫీసు పెట్టుకోవాలని అఖిలప్రియ నిర్ణయించడం వెనక పెద్ద వ్యూహమే ఉందని చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ ఆళ్లగడ్డలో కాకుండా నంద్యాలలో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే నంద్యాల టీడీపీ సీటును మాజీ మంత్రి ఫరూక్తో పాటు ఫరూక్ తనయుడు ఫిరోజ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పుడు అఖిలప్రియ ఎంట్రీతో నంద్యాల టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ఇందుకు కారణాలు లేకపోలేదన్నది పార్టీ వర్గాల మాట. ఆళ్లగడ్డ సీటు విషయంలో టీడీపీ అధినేత ఆంక్షలు పెట్టారని.. మూడు నెలల్లో నియోజకవర్గంలో పరిస్థితి మెరుగు పర్చుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అందుకే ఆళ్లగడ్డను విడిచి పెట్టి నంద్యాలపై అఖిలప్రియ ఫోకస్ పెట్టారని అభిప్రాయపడుతున్నారట. అదే జరిగితే భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో బరిలో ఉండేదెవరనే చర్చ కూడా ఉంది.